- హోం శాఖకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల వివరాలపై రిపోర్టు ఇవ్వాలని హోం శాఖను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి దాకా ఉన్న పెండింగ్ మిస్సింగ్ కేసుల పరిష్కారాలు ఏఏ దశల్లో ఉన్నాయో తెలపాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2006లో రామంతపూర్లో మిస్సయిన19 ఏండ్ల యువకుడు ఎన్.సీతారాములు (ఇప్పుడు వయసు 35 ఏండ్లు) కేసు ప్రస్తుత స్టేటస్ ఏంటో చెప్పాలని నోటీసులిచ్చింది.
2006లో హైదరాబాద్ రామంతపూర్లోని పాలిటెక్నికల్ కాలేజీలో డిప్లొమా రెండో ఏడాది చదువుతున్న సీతారాములు కన బడటం లేదని ఆయన సోదరుడు ఎన్.శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శ్రీరాములు ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.