జింఖానా గ్రౌండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టిక్కెట్స్ కోసం వచ్చిన వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాటలో నలుగురు పోలీసులు, పది మంది అభిమానులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఉదయం నుంచి టికెట్స్ ఇష్యూ చేస్తున్నప్పటికీ.. ఆలస్యం జరుగుతోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 25న నగరంలో జరిగే ఇండియా–ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ రెండు, మూడు రోజులుగా ఉప్పల్, జింఖానా గ్రౌండ్చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.బుధవారం వేల సంఖ్యలో యువకులు జింఖానా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటిదాకా మొత్తం టిక్కెట్లను ఆన్లైన్లోనే అమ్ముతామని హెచ్సీఏ ప్రకటించింది. కానీ, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత గురువారం ఉదయం 10 నుంచి జింఖానా కౌంటర్లలో టిక్కెట్లు అందుబాటులో ఉంచుతామని ప్రెసిడెంట్ అజరుద్దీన్ పేరిట ఓ ప్రకటన వచ్చింది.