Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!

Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!

ఎల్బీనగర్లో తిరుగుతున్న ప్రతి పోలీస్ బండిపై 'రాచకొండ' అని రాసి ఉంది. "దొంగలను పట్టుకున్న రాచకొండ పోలీసులు" అని వార్తలు కూడా వస్తుంటయ్. అసలు ఈ రాచకొండ ఎక్కుడుంది? అన్న.. దీని ప్రత్యేకత ఏంటి? నాకు చూడాలని ఉంది" అనడిగింది మా చెల్లె సొమ్య. నా పేరు గుండమల్ల సంతోష్ కుమార్. ఎంబీఏ కంప్లీట్ చేసిన, మాది రాచకొండ ప్రాంతమే అయినప్పటికీ.. హైదరాబాద్లో ఉండటం వల్ల చూడటానికి వీలుపడలేదు. 

నేనన్నా.. ఓ సారి రాచకొండను చూసిన కానీ..మా చెల్లెకు మాత్రం దాని గురించే తెల్వదు. తన కోసం మా అమ్మా, అమ్మ వాళ్ల దోస్తు స్వప్న.. మొత్తం నలుగురం కలిసి మార్చిల రాచకొండ పోయినం! రాచకొండ మొత్తం చూసినంక... 'ఇంత చరిత్ర ఉందా? మన ఊరికి అని మా చెల్లె ఆశ్చర్యపోయింది. మా చెల్లెలాగనే దీని గురించి తెల్వనోళ్లు మస్తు మంది ఉన్నరు. అందుకే 'రాచకొండ గుట్ట' చరిత్రని.. అక్కడ మేం పొందిన అనుభూతిని 'లైఫ్ లో మీ ముచ్చట'తో పంచుకోవాలనిపించింది.

పు స్తకాలకు ఎక్కిందే చరిత్ర అనుకుంటే పొరపాటు. మన చుట్టూ ఉండే పరిసరాల్లో నాటి మానవుడు మిగిల్చిపోయిన ప్రతి గుర్తు చరిత్రే. గుర్తింపు పొందినది మాత్రమే చరిత్ర కాదు. తన వెనకటి మనిషి ఎట్ల బతికిండో తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటది. ఆ తపనను, ఆ అన్వేషణ తాలూకు దాహాన్ని తీర్చేవి చరిత్ర ఆనవాళ్లే! అలా చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లలో ఒకప్పటి 'రాచకొండ రాజ్యం' ఒకటి!

ఎక్కడుంది?

హైదరాబాద్ కు సమీపంలో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉన్న రాచకొండ గుట్టలకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే.. రాచకొండ గతమంతా ఘనమే. యాంత్రిక జీవనానికి, కాలుష్యానికి దూరంగా ఒక రోజు ప్రశాంతంగా గడిపి రావాలనుకునే వాళ్లకు రాచకొండ మంచి విడిది. కళ్లు తిప్పనియ్యకుండా చేసే 'రాచకొండ ముఖ ద్వారం' అందరికీ స్వాగతం పలుకుతూ ఆలోచనలన్నింటిని నాటి కాలానికి మళ్లిస్తది.. గట్టి బండరాళ్లతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ప్రాకారాలు, ఆనాటి రక్షణ వ్యవస్థ పటిష్టతని తెలియజేస్తయ్. ఆరు వందల అడుగుల ఎత్తైన ఆ గుట్టపై రాచకొండను ఏలిన రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన ప్రభువులు కొలువుదీరేవారంట.

అనుకున్న తెల్లారే..

మా చెల్లె సౌమ్య ఇంటర్ చదువుతోంది. మార్చిలో తను రాచకొండ గురించి అడిగినప్పుడు.. 'వీలున్నప్పుడు తీస్కపోతలేరా' అని చెప్పిన. 'కాదు... కాదు. కాలేజీకి రెండు రోజులు సెలవులు ఉన్నయ్. రేపే పోదాం" అని పట్టుపట్టింది. 'సరే' అని... తెల్లారీ... హైదరాబాద్ నుంచి రాచకొండ పయనమైనం. చెల్లి, అమ్మ, అమ్మ ఫ్రెండ్ స్వప్న... ముగ్గురిని తీసుకుని కారులో పోతుంటే.. చౌటుప్పల్ నుంచి రాచకొండ చేరుకునే దారిలో పచ్చని చెట్లు, అందమైన రాళ్ల గుట్టలు... ప్రదేశాన్ని బట్టి ప్రకృతి ఎట్ల మారుతుందో కళ్లకు కట్టింది. కారు అద్దాలు తీసి మరీ బయటకు చూస్తున్న మా చెల్లె సంతోషానికి అవధులేలేవు.

కొండపైకి చేరగానే..

కొండ చుట్టూ ప్రాకారం.. మధ్య మధ్యన ఎత్తైన బురుజులు, వాటిపై పేల్చడానికి సిద్ధంగా ఉన్న ఫిరంగుల అమరికలు ఉన్నయ్. వాటిని దాటి కొండపైకి చేరినం. ఈ గుట్టపైన మండపాలు, రాజప్రాసాదాలు, తటాకాలు, జలాశయాలు కనిపించినయ్. అవన్నీ నాటి జీవన శైలికి చిహ్నాలు. గుట్టపైనే రెండు పెద్ద బండరాళ్ల చీలిక మధ్య 'సంకెళ్ల బావి' ఉంది. ఏ కాలమైనా.. అందులో నీళ్లు ఉండటం విశేషం! గుట్ట మొత్తం తిరిగితే.. ఎక్కడ చూసిన అద్భుత శిల్ప సంపద కనపడింది.

ఆ చిహ్నాలు ఇంకా ఉన్నయ్

రాచకొండ చేరుకోంగనే.. ముందుగా అక్కడ తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని దర్శించుకున్నం. నాటి గొప్ప శిల్ప సంపద, శైవ భక్తి మూలాలకు అది ప్రతీక. సౌమ్యకు శివుడు అంటే చాలా ఇష్టం. దర్శనం తర్వాత రాచకొండ గ్రామంలో ఉన్న శ్రీరాముల వారిగుడికి వెళ్లి.. దాని చరిత్ర తెలుసుకున్నం. అక్కడ దర్శనం ముగించుకుని.. రాచకొండ గుట్టపైకి సాగినం. ముఖద్వారం నుంచి ఆరువందల అడుగుల ఎత్తున్న గుట్టపైకి ఎక్కుతుంటే ఆయాసం రావడం ఖాయం. అందుకే మధ్య మధ్యలో అక్కుంట... మొత్తం మీద గుట్టపైకి ఎక్కినం. అక్కడ చుట్టూ ఎటూ చూసిన చూపు తిప్పుకోలేని.. 

వారసత్వ సంపద కనిపించింది. అనాటి రాచకొండ రాచరిక అవశేషాలు, విధ్వంసపు చిహ్నాలు కనపడ్డాయ్. ఇగ గుట్టమీద రెండు బండరాళ్ల మధ్యలో.. ఉన్న సంకెళ్ల బావి చూసి ఆశ్చర్యపోయినం. చుట్టూ చూస్తే.. ఎదారిలాగా నీళ్ల జాడలేదు. 'ఇందులో నీళ్లెక్కడంగ వచ్చినయబ్బా' అని అట్లనే చూస్తూ ఉండిపోయినం. గుట్ట మీది నుంచి కిందకు చూస్తుంటే కనవడే ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మాటల్లో చెప్పలేం. గుట్ట మీద మొత్తం తిరుగుతూ అందరం కలిసి ఫొటోలు దిగినం. తర్వాత అమ్మ తీసుకొచ్చిన అన్నం... అక్కడే ఉన్న ఒక గుండు మీద కూసొని తిన్నం.

సౌమ్యకు ఇల్లు, కాలేజీ తప్ప..బయటి ప్రపంచం తెల్వదు. అమ్మదోస్తు స్వప్నకు కూడా గ్రామీణ వాతావరణంతో పెద్దగా పరిచయం లేదు. 'ఎంత మంచి ప్లేసు తీసుకొచ్చినవో' అని అందరూ ఖుషి అయితూ నాకు థ్యాంక్స్ చెప్పినరు! సాయంత్రం వరకు అక్కడే గడిపి.. తర్వాత ఇంటి బాట పట్టినం. ఆ జ్ఞాపకాలు.. అలాగే ఉండిపోయినయ్. ఇలా కుటుంబ సమేతంగా.. రాచకొండకు వెళ్లి.. మా లాంటి అనుభూతిని పొందొచ్చని ఎంతోమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో... 'లైఫ్ లో మా ముచ్చట' తో నా అనుభవాలు పంచుకున్న.

జర పట్టించుకోవాలె

ఇంత గొప్ప చరిత్ర కలిగిన రాచకొండను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినయ్. తెలంగాణ ఏర్పడినంక ఈ ప్రాంత అభివృద్ధికి తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం పురాతన దేవాలయం పునాదులు పడినయ్. రాచకొండ పేరును నిత్యం తలచుకునే విధంగా 'రాచకొండ కమిషనరేట్ 'ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫలితంగా ఈ ప్రాంతానికి కొంత గుర్తింపు వచ్చింది. కానీ, పురావస్తు శాఖ వాళ్లు దీన్ని అంతగా పట్టించుకోవడం లేదు. 

దీంతో చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన గొప్ప గొప్ప కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నయ్.. రక్షణ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల శిల్ప సంపద తరలిపోతోంది. రాచకొండలో ఉన్న 150కి పైగా దేవాలయాలు, ఇతర కట్టడాలు శిథిలావస్థకు చేరకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలె. రాచకొండను అభివృద్ధి చేసి.. పర్యాటక కేంద్రంగా మార్చాలె.

రాచకొండ రాజ్యం

కాకతీయ రాజ్య పతనం తర్వాత రేచర్ల పద్మనాయకుల పాలన... రాచకొండ కేంద్రంగా సుమారు వందేళ్ల పాటు సాగింది. 1361 లో పద్మనాయకులు తమ రాజధానిని అమనగల్లు నుంచి రాచకొండకు మార్చినరు. తర్వాత కాలంలో నేటి తెలంగాణ అంతటికీ తమ రాజ్యాన్ని విస్తరించినరు. రేచర్ల పద్మనాయకుడు వంశానికి చెందిన అనపోతనాయుడు 1361 నుంచి 1384 వరకు రాచకొండను పాలించిండు. అతని కాలంలోనే ఈ రాచకొండ దుర్గాన్ని నిర్మించినరు. ఈ రాజులంతా శైవమతాభిమానులు అందుకే గుట్టలపై సోపానాలు, శివాలయాలను నిర్మించినరు. 

నాటి అగ్రహారాలు, దేవాలయాలు, విద్యాలయాలుగా విలసిల్లేవి. రాచకొండను పాలించిన మూడో సింగభూపాలుడు ఏటా వసంతోత్సవాలను ఏర్పాటు చేసి.. సకల కళా కోవిధులను సన్మానించేవాడు. అతను స్వయంగా కవి కూడా. విశ్వకవి, పశుపతి, నాగపండితుడు, బొమ్మకంటి అప్పయదార్యుడు. గౌరస్న వంటి పేరుగాంచిన కవులంతా ఇతని ఆస్థానంలోని వాళ్లే. అంతా వేదాంతాలు, ఇతిహాసాలు, పురాణాలు, అలంకార శాస్త్రాలు, రాజనీతి, సంగీత కళాశాస్త్రాలను అవపోసన పట్టిన దిట్టలేనంట. కొంతకాలం తర్వాత బహుమని సుల్తాన్ల దాడికి రాచకొండ రాజ్యం పతనమైంది.