హెచ్ఎండీఏ భూములకు జియో ట్యాగ్

హెచ్ఎండీఏ భూములకు జియో ట్యాగ్
  •    కబ్జాలకు చెక్​ పెట్టేందుకు అధికారుల నిర్ణయం 
  •     ఇస్రీ సంస్థతో హెచ్ఎండీఏ మూడేండ్ల అగ్రిమెంట్  
  •     శాటిలైట్ ​మానిటరింగ్​ ద్వారా భూముల పరిరక్షణ 
  •     వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీకి జియోట్యాగ్ సేవలు

హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్​మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు త్వరలో కొత్త టెక్నాలజీ అమల్లోకి రానుంది. ఇందుకు అధికారులు ‘జియోట్యాగ్​’విధానాన్ని వినియోగించేందుకు నిర్ణయించారు. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు, సమీప 7 జిల్లాల్లో 70 మండలాలు, 1032 గ్రామాల్లో హెచ్ఎండీఏ పరిధి 7,257 చ. కి.మీ విస్తరించింది. దీంతో  సంస్థ భూముల పరిరక్షణ పెద్ద టాస్క్ గా మారుతోంది.

 ఇప్పటికే కొందరు ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తుండగా.. కిందిస్థాయి సిబ్బంది సహకరిస్తున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువగా రాజకీయ నేతలు ఉంటుండగా సమస్యలు ఎప్పటికప్పుడు జఠిలం అవుతున్నాయి. తాజాగా హెచ్ఎండీఏ పరిధిని కూడా విస్తరించాలని కాంగ్రెస్​ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపు మరో 70 చ. కి.మీ. పరిధి పెరిగే చాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ భూముల పరిరక్షణకు ఉన్నతాధికారులు కొత్త టెక్నాలజీని వినియోగించాలని ఆలోచన చేశారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా సంస్థ భూముల్లో ఎలాంటి నిర్మాణం జరిగినా, కబ్జా అయినా వెంటనే శాటిలైట్​మానిటరింగ్​లో ద్వారా తెలిసిపోతుంది. తద్వారా రాబోయే రోజుల్లో హెచ్ఎండీఏ భూముల పరిరక్షణ మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. 

జియో ఇన్ఫర్మేషన్ ద్వారా రక్షణ 

హెచ్​ఎండీఏ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అమలు చేసే జియో గ్రాఫిక్​ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు యూఎస్ కు చెందిన ఎన్విరాన్​మెంటల్​సర్వీస్​అండ్​రీసెర్చ్​ఇన్ స్టిట్యూట్(ఇస్రీ) సంస్థతో హెచ్ఎండీఏ 3 ఏండ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. దీని  ప్రకారం హెచ్ఎండీఏ ఆఫీసుల్లో ఒక మానిటర్​సెంటర్​ను ఏర్పాటు చేసి, భూములను శాటిలైట్​ద్వారా మానిటరింగ్​ చేస్తారు. ముందుగా సంస్థ ఆధీనంలోని ప్రభుత్వ భూముల పూర్తి వివరాలను సేకరిస్తారు. భూముల మొత్తం కొలతలను జియోట్యాగ్​చేస్తారు. 

అంటే ఆయా ప్రాంతాల్లోని భూముల సైజులను పూర్తిగా హెడ్డాఫీసులోని మానిటరింగ్​సెల్​కు అనుసంధానిస్తారు. దీంతో ఎక్కడైనా, ఎవరైనా  కబ్జా చేసేందుకు యత్నించినా, ఏవైనా నిర్మాణాలు చేపట్టినా వెంటనే మానిటరింగ్​సెంటర్​కు సిగ్నల్ అందుతుంది. తద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారులు కబ్జాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే అమెరికా  వంటి దేశాల్లో  ఇలాంటి సేవలు అందించడంలో ఇస్రీకి ప్రత్యేక గుర్తింపు ఉందని అధికారులు తెలిపారు. కేవలం భూముల కబ్జాలే కాకుండా ల్యాండ్​పూలింగ్​ సమయాల్లోనూ రైతుల భూములను తీసుకునేప్పుడు కూడా వాటికి జియోట్యాగ్​చేస్తారు. 

అక్రమ నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్ను వసూలుకు వినియోగం..

హెచ్ఎండీఏ అమల్లోకి తెచ్చే  జియోట్యాగింగ్​ విధానాన్ని బల్దియా, వాటర్ బోర్డుకు కూడా సేవలు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా వాటర్​బోర్డు పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లను కనిపెట్టేందుకు, బోర్డుకు చెందిన భూములు, భవనాలను,  రిజర్వాయర్లను కూడా మానిటర్​చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వాటర్ ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా ప్రస్తుతం వాటర్​బోర్డు అధికారులు జీపీఎస్​ విధానాన్ని అమలు చేస్తున్నా  భవిష్యత్ లో జియో ట్యాగింగ్ ద్వారా ఇతర సేవలను కూడా వినియోగించుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.  ఇక బల్దియా పరిధిలో కూడా ప్రభుత్వ భూములు, పార్కులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటారు. ఆస్తి పన్నులు వసూలుకు కూడా ప్రతి ఇంటిని జియోట్యాగ్​చేసే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.