రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? లేడా?: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్

రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? లేడా?: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
  • ఆయనకు ఫోన్ చేసి బతికించుమన్నా ఓ వ్యక్తిని కాపాడలేకపోయిండు
  • నెలలో కోడ్ వస్తది.. అందుకే  కేసీఆర్ హడావుడి చేస్తున్నడు
  • బీఎస్పీ స్టేట్​చీఫ్​ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్


కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని,హోంమంత్రికి ఓ సంఘ సేవకుడు ఫోన్ చేసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని మొరపెట్టుకున్నా అతడి ప్రాణాలు దక్కకపోవడం చూస్తే రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? లేడా? అనే అనుమానం వస్తున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం పర్యటనలో భాగంగా కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో  ఆయన మాట్లాడారు.
నెలలో ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందని, అందుకే  సీఎం కేసీఆర్​ స్కీమ్ ల మీద స్కీమ్ లు తీస్తున్నాడని,  ప్రజలు పైలంగా ఉండాలని సూచించారు.  హైదరాబాద్​లోని హకీంపేటకు చెందిన సంఘ సంస్కర్త  స్వయంగా హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాణం కాపాడాలని వేడుకున్నా ఆయన ప్రాణం నిలవలేదని ఈ నెల 10న ఆయన హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 
నిజాలను నిర్భయంగా బయటపెడ్తున్న పత్రికలు, చానల్స్​పై ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. మీడియాను చూస్తే కేసీఆర్ భయపడ్తున్నారని ఎద్దేవా చేశారు.   కౌ టల మండలం తుమ్మిడిహెట్టి వద్ద  ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం కాల్వలు తవ్వి వదిలేశారని,  కాంట్రాక్టర్ల  కమీషన్ల  కోసం ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టి  వార్ధా నదిపై బ్యారేజ్ కడ్తానని చెప్పడం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనన్నారు.   
సిర్పూర్​ టీ మండలం కేశవ పట్నంలో ఇటీవల ఇచ్చిన పోడు భూముల పట్టాలను వెనక్కి తీసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నించడం కరెక్ట్​కాదని,  దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, అధికార ప్రతినిధి జక్కని సంజయ్, జిల్లా అధ్యక్షుడు మోర్లే గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.