
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో 5,877 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రాపర్టీ కన్సల్టన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. అంతకు ముందు నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది 31 శాతం గ్రోత్కు సమానం. రిజిస్ట్రేషన్ జరిగిన ఇండ్ల మొత్తం విలువ రూ.2,994 కోట్లుగా ఉంది. వాల్యూ పరంగా చూసిన ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 31 శాతం గ్రోత్ను నమోదు చేసింది. కాగా, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్గా పిలుస్తున్నారు.
మే నెలలో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య రేట్లు ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 55 శాతంగా ఉంది. రూ.25 లక్షల కంటే తక్కువ విలువున్న ఇండ్ల వాటా 17 శాతంగా, రూ. కోటి అంతకంటే ఎక్కువ విలువున్న ఇండ్ల వాటా 7 శాతంగా ఉంది. రూ.50 నుంచి రూ.75 లక్షల మధ్య రేట్లు ఉన్న ఇండ్ల వాటా 20 శాతంగా రికార్డయ్యింది. మరోవైపు 1,000 – 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 70 శాతంగా ఉంది. 500– 1,000 చదరపు అడుగుల ఇండ్ల వాటా 16 శాతంగా ఉంది. కిందటి నెలలో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో 45 శాతం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నుంచి జరిగాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 39 శాతం, హైదరాబాద్ జిల్లా నుంచి 16 శాతం ఉన్నాయి.