బాల్క సుమన్ రాక్షస పాలన అంతం చేద్దాం : సరోజ వివేక్ వెంకట స్వామి

బాల్క సుమన్ రాక్షస పాలన అంతం చేద్దాం : సరోజ వివేక్ వెంకట స్వామి
  • వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ
  • భీమారం మండలం బూరుగుపల్లిలో ఇంటింటి ప్రచారం

జైపూర్(భీమారం)వెలుగు : చెన్నూర్​లో బాల్క సుమన్ రాక్షస పాలనను అంతం చేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ పిలుపునిచ్చారు. భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలో గడ్డం సరోజ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ భూక్య తిరుమల, గ్రామ మహిళలు డప్పు చప్పుళ్లతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. తిరుమలతో పాటు 50 మంది మహిళలు కాంగ్రెస్​లో చేరగా వారికి సరోజ కండువాలు కప్పారు. అనంతరం తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను సరోజకు చెప్పుకున్నారు. తమ కాలనీల్లో తాగు నీటి సమస్య ఉందని, డ్రైనేజీలు, రోడ్లు నిర్మించలేదని, డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జనం కష్టాలు చూస్తుంటే కన్నీళ్ల వస్తున్నాయని గడ్డం సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణను బండల తెలంగాణ చేశారని విమర్శించారు. బాల్క సుమన్ అనే నరకాసురున్ని తరిమేయాల్సిన టైం వచ్చిందన్నారు.   కాకా వెంకట స్వామి హయాంలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. వివేక్ వెంకటస్వామి విశాఖ ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో తాగు నీటి కోసం వేల బోర్ వెల్స్ వేశామని, కరోనా టైమ్​లో నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యవసరాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తీసురావాలని కోరారు. కాజిపల్లి సర్పంచ్ తిరుపతి, పార్టీ మండల ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, లీడర్లు భూక్య లక్ష్మణ్, పెద్దల బాపు, చేడంక తిరుపతి, పొడేటి రవి, వేల్పుల శ్రీనివాస్, కోట రవి తదితరులు పాల్గొన్నారు.