శ్రీరామనవమి పండుగను ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా..

శ్రీరామనవమి  పండుగను ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా..

 శ్రీ రామ నవమి ఏటా వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీ రాముడు జన్మించడాని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు. సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీ రామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి ఆ రోజు( ఏప్రిల్​ 17)న చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది శ్రీరామనమమి రోజు. సీతారాముల కల్యాణం కూడా ఆ రోజునే జరిగిందని పండితులు చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా  చైత్ర మాసం శుద్ద నవమి రోజున (ఏప్రిల్​ 17)  శ్రీ రామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది... అదే రామాయణం.

శ్రీరామనవమి రోజున  (ఏప్రిల్​ 17) కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటు స్నానమాచరించాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు, కుంకుమతో పాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేయాలి.  ఇంటి ముందు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. దేవుడి పటాలను పసుపు, కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధంగా ఉంచాలి. 

సీతారామ లక్ష్మణ, భరత శతృఘ్నులతో కూడిన భగవంతుడి చిత్ర పటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.ఇంటి దగ్గరలోని రామాలయం సందర్శించుకుంటే మంచిది. లేకుంటే దగ్గర్లో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది.

12 గంటలకు ఎందుకు పూజ చేయాలి

శ్రీరాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్‌ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శ్రీరామ నవమి పూజ

శ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి. అనంతరం శ్రీ రామ పట్టాభిషేకం కథను పారాయాణం చేయడం ద్వారా శుభఫలితాలు అందుకుంటారు. పూలతో అలంకరించి.. నైవేద్యాన్ని సమర్పించాలి. పానకం, వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి.  నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయి.

పానకం, వడపప్పు ఎందుకు

భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్‌ రుతువు, వసంత రుతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

పానకం.. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం

అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధోవికాసం కలుగుతుంది.

దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం లాంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకల సిరిసంపదలు చేకూరుతాయి. పూజకు కంచు దీపం, రెండు దీపారాధనలు. ఐదు వత్తులను ఉపయోగించాలి.  శ్రీరాముని కళ్యాణం చిత్ర పటాన్ని  తులసి మాలతో అలంకారం చేయాలి. పూజానంతరం శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామ నిత్యపూజ లాంటి పూస్తకాలను తాంబులాలతో కలిపి ముత్తయిదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.