హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఈజీ
వచ్చే నెల నుంచి కొత్త విధానం
పాలసీల ద్వారా మరిన్ని ట్రీట్ మెంట్స్
లేటెస్ట్ ట్రీట్ మెంట్లకు పర్మిషన్ ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: ఇక నుంచి కొత్త, పాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మరింత కస్టమర్ ఫ్రెండ్లీగా మారబోతున్నాయి. మరిన్ని వ్యాధులను, ట్రీట్మెంట్లను పాలసీల్లో చేర్చబోతున్నారు. ఇందుకోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తయారు చేసిన గైడ్లైన్స్ వచ్చే నెల నుంచి అమలవుతాయి. అయితే కొత్త విధానం వల్ల పాలసీ ప్రీమియాలు పెరిగే చాన్సులు ఉన్నాయి. గత ఏడాది అక్టోబరు తరువాత జారీ అయిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కొత్త గైడ్లైన్స్ ప్రకారమే జారీ అయ్యాయి. పాత పాలసీలను కొత్త విధానంలోకి మార్చడానికి కంపెనీలకు ఐఆర్డీఏ గత అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు ఇచ్చింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ట్రీట్మెంట్ గ్యారంటీ
హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డర్ ఎనిమిదేళ్లపాటు ప్రీమియాలు చెల్లించిన తరువాత ఎలాంటి క్లెయిమ్స్ చేసినా తిరస్కరించడం కుదరదు. అంటే, ఎలాంటి వ్యాధి వచ్చినా ట్రీట్మెంట్ ఖర్చును భరించాలి. మోసం జరిగిందని తేలినా లేదా ఏవైనా ప్రత్యేక మినహాయింపులు ఉంటే మాత్రమే రిజెక్షన్ను అనుమతిస్తారు. మోసం జరిగిందని ఇన్సూరెన్స్ కంపెనీయే నిరూపించాలి. మోసం జరిగినట్టు తేలితే పాలసీ రద్దవుతుంది. అప్పటి వరకు చెల్లించిన పేమెంట్స్ కంపెనీకే చెందుతాయి. మిగతా రూల్స్ మాత్రం ఎప్పటిలాగానే అమలవుతాయి. కొన్ని పాలసీల్లో కో–పేమెంట్స్, సబ్-–లిమిట్స్, డిడక్టబుల్స్ ఉండవచ్చు. కొన్ని వైద్యపరికరాలకు, సేవలకు రీయింబర్స్మెంట్ ఉండకపోవచ్చు. ఉదాహరణకు కొన్ని కంపెనీలు డిస్పోజబుల్ మాస్కులు, గ్లౌజులకు డబ్బులు చెల్లించవు.
క్రిటికల్ ఇల్నెస్ క్లెయిమ్లను అనుమతించాల్సిందే..
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో 16 తీవ్రమైన జబ్బుల ట్రీట్మెంట్కు సాధారణంగా కంపెనీలు హామీ ఇవ్వవు. ఏవైనా ట్రీట్మెంట్లకు కంపెనీ అనుమతి లేకుంటే.. ఆ విషయాన్ని పాలసీ హోల్డర్కు పాలసీ రాసే సమయంలోనే చెప్పాలి. సర్కోడోసిస్, మాలినంట్ నియోప్లాజమ్, మూర్ఛ, గుండె జబ్బులు, కాలేయం, ప్రాంక్రియాస్, ఎయిడ్స్, చెవుడు, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉన్న వారి ట్రీట్మెంట్ ఖర్చులను కంపెనీలు భరించవు. కొత్త గైడ్లైన్స్ ప్రకారం.. ఈ వ్యాధులు ఉన్న వారి పరిస్థితి క్షిణిస్తే ట్రీట్మెంట్ ఖర్చులను కచ్చితంగా భరించాలి. అంటే బాధితుడు క్రిటికల్ కండిషన్లో ఉంటే క్లెయిమ్ను రిజెక్ట్ చేయడం కుదరదు.
ఇది వరకున్న వ్యాధిపై క్లారిటీ
పాలసీ తీసుకుంటున్నప్పటికే ఉన్న వ్యాధులకు (ప్రి–ఎగ్జిస్టింగ్ డిసీజెస్) సాధారణంగా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవు. అయితే వరుసగా రెండేళ్లు ప్రీమియం చెల్లించిన తరువాత మాత్రం ఈ పాత వ్యాధుల ట్రీట్మెంట్ ఖర్చునూ భరించాలి. అయితే కంపెనీలను బట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. సాధారణంగా మెజారిటీ కంపెనీల పాలసీల్లో వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లు ఉంటుంది.
లేటెస్ట్ ట్రీట్మెంట్ల ఖర్చూ భరించాలి…
యుటిరిన్ ఆర్టరీ ఎంబాలైజేషన్, హెచ్ఐఎఫ్యూ, బెలూన్ సైనుప్లాస్టీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఓరల్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్, రోబోటిక్ సర్జరీస్ వంటి లేటెస్ట్ ట్రీట్మెంట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కచ్చితంగా అనుమతి ఇవ్వాలి. ఇన్ పేషెంట్లకు అయినా ఔట్ పేషెంట్లకు అయినా, డేకేర్ ట్రీట్మెంట్ అయినా.. చికిత్స అవసరం ఉంటే కాదనకూడదు.
ఐసీయూ చార్జీల్లో కోత కుదరదు
ఐసీయూ చార్జీల్లో కొంత పేషెంటే భరించాలని షరతు పెట్టడం ఇక నుంచి కుదరదు. ఎలాంటి ఐసీయూ ట్రీట్మెంట్ అయినా, పూర్తిగా రీయింబర్స్ చేయాల్సిందే. ఈ విషయమై పాలసీబజార్ డాట్కామ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ కరోనా ట్రీట్మెంట్ తీసుకునే రోగులకు కొన్ని కంపెనీలు ఐసీయూ చార్జీల్లో కోతపెట్టాయని చెప్పారు. ఇక నుంచి ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చని అన్నారు.
ప్రీమియం రేట్లు పెరగొచ్చు..
కొత్త గైడ్లైన్స్ వల్ల పాలసీ హోల్డర్లకు అనేక సదుపాయాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల పాలసీ ప్రీమియం రేట్లను కంపెనీలు పెంచే చాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కరోనా వల్ల బీమా కంపెనీల ఖర్చులు, మెడికల్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగడమూ మరో కారణమని అంటున్నారు. ఎక్కువ వయసు ఉన్న వారికి, ప్రి–ఎగ్జిస్టింగ్ డిసీజ్లు ఉన్న వాళ్లు మరింత ప్రీమియం చెల్లించే పరిస్థితి రావొచ్చని చెబుతున్నారు.
For More News..