సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు మన నిత్యం జీవితంలో భాగమే అయినా, వీటితో చాలా సమస్యలు వస్తున్నాయని జనం భావిస్తున్నారు. వీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని నమ్ముతున్నారు. స్మార్ట్ డివైజ్ మేకర్ వివో ‘స్విచాఫ్’ పేరుతో సైబర్మీడియా రీసెర్చ్తో కలసి చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర సంగతులు తెలిశాయి. తమ జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఫోన్ చూస్తున్నామని 67 శాతం మంది రెస్పాండెంట్లు అంగీకరించారు. ఫోన్ల కారణంగా తమ వాళ్లతో కులాసాగా గడిపే సమయం చాలా వరకు తగ్గిందని 89 శాతం మంది అన్నారు. ఇతరులతోనూ సంబంధాలు తగ్గుతున్నాయని చెప్పారు. తమ జీవితభాగస్వామికి మరింత సమయం కేటాయించాలని ఉందని 84 శాతం మంది కోరుకుంటున్నారు. ఫోన్లను మరీ ఎక్కువగా వాడటం వల్ల జీవితభాగస్వామితో సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒప్పుకున్నారు. వాళ్లతో మరింత ఎక్కువగా మాట్లాడాలని ఉందని 90 శాతం మంది చెప్పారు. రోజులో ఫోన్ కోసం దాదాపు 4.7 గంటలు గడుపుతున్నామని మెజారిటీ రెస్పాండెంట్లు చెప్పారు.
ఫోన్లో ఉన్నప్పుడు జీవితభాగస్వామి ఏదైనా అడిగితే విసుక్కుంటున్నామని 70 శాతం మంది అన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణేలో 1,000 మందితోఈ సర్వే చేశామని వివో తెలిపింది. స్మార్ట్ఫోన్ వల్ల అప్పుడప్పుడు పరధ్యానంలో ఉంటున్నామని 69 శాతం మంది రెస్పాండెంట్లు అన్నారు. జీవిత భాగస్వామి పట్ల తగినంత శ్రద్ధ చూపడం లేదని 68 శాతం మంది చెప్పారు. తమ తీరిక దొరికినప్పుడల్లా స్మార్ట్ఫోన్పై గడుపుతున్నామని 88 శాతం మంది రెస్పాండెంట్లు అంగీకరించారు. విశ్రాంతి తీసుకోవడానికి స్మార్ట్ఫోన్ అత్యంత ఇష్టపడే మార్గమని 90 శాతం మంది రెస్పాండెంట్లు వివరించారు. రెస్పాండెంట్లలో ఎక్కువ కుటుంబంతో సమయం గడుపుతూనే తమ స్మార్ట్ఫోన్ను వాడుతున్నారు. ఖాళీ దొరికిన వెంటనే ఫోన్వాడాలని 89 % మంది కోరుకుంటున్నారని ఈ స్టడీ వివరించింది.