
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ RGAI నుండి ప్రయాణించేవారు లేదా ఇక్కడికి వచ్చే ప్రయాణీకుల కోసం కొత్తగా "థెరపీ డాగ్ ప్రోగ్రామ్" ప్రవేశపెట్టింది. ఎయిర్ పోర్ట్ నిర్వహిస్తున్న సంస్థ GMR గ్రూప్ తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం కింద ప్రయాణికులు ఫ్రెండ్లీ కుక్కలతో ఖాళీ సమయాన్ని గడపోచ్చు. ఇలా కుక్కలతో సమయం గడపడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంకా ప్రయాణ సమయంలో హుషారుగా ఉండేలా చేస్తుంది.
మొదట ఈ కార్యక్రమాన్ని నాలుగు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన టాయ్ పూడ్లెస్తో ప్రారంభించారు, టాయ్ పూడ్లెస్ అనేది ఒకరకమైన బ్రీడ్ కుక్కలు. ఇవి ప్రశాంతత ఇంకా త్వరగా అలవాటు పడే స్వభావంతో ఉంటాయి.
పైలట్ ప్రాతిపదికన ప్రారంభం : ఈ ప్రోగ్రాం ప్రస్తుతం పైలట్ దశలో ఉంది, ప్రయాణీకుల స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశపెట్టొచ్చని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రోగ్రాంకి స్పందన నిజంగా బాగుంది, విమానాశ్రయంలో ప్రయాణీకులను స్వాగతించే ఈ ఆలోచనని ప్రజలు అభినందిస్తున్నారు కూడా అని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ కుక్కలను మైంటైన్ చేయడానికి శిక్షణ పొందిన ట్రైనర్ల టీం ఎప్పుడు వాటితో పాటు ఉంటారు. అలాగే విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రతకి హామీ ఇస్తున్నారు.
"కుక్కలను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అద్భుతమైన ఆలోచన. దీనిని ఇలానే కొనసాగించండి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక ధన్యవాదాలు" అని ఒక ప్రయాణీకుడు అన్నారు.
ప్రతి శుక్రవారం నుండి సోమవారం వరకు దేశీయ, అంతర్జాతీయ డిపార్చర్లో కొన్ని చోట్ల ఈ కుక్కలు ఉంటాయి. అలాగే ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ నాలుగు గంటలు అక్కడే ఉంటాయి. ప్రయాణికులు ఇష్టంగా కుక్కలతో కలిసి కాసేపు ఉండాలనుకుంటే ఉండొచ్చు. దీనివల్ల వారికీ ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.