ధర్నా విరమించిన హైదరాబాద్ మెట్రో కాంట్రాక్టు సిబ్బంది 

ధర్నా విరమించిన హైదరాబాద్ మెట్రో కాంట్రాక్టు సిబ్బంది 

హైదరాబాద్ మెట్రో సిబ్బంది ధర్నా విరమించారు. ఆందోళన చేపట్టిన ఉద్యోగులతో కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్‌ ప్రతినిధులు చర్చలు జరిపారు. తమకు జీతాలు పెంచాలని ప్రధానంగా చర్చించామని ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతానికి ధర్నా విరమిస్తున్నామని, మూడు రోజుల్లో మరోసారి తమను చర్చలకు రమ్మన్నారని కాంట్రాక్టు ఉద్యోగులు వెల్లడించారు. మరోసారి కియోలిస్‌ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అయితే.. తమకు జీతాలు ఎంతమేర పెంచుతారో క్లారిటీగా చెప్పే వరకూ విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. 

కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

అంతకుముందు.. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇవాళ విధులు బహిష్కరించి.. ఆందోళన చేపట్టారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి.. తమ నిరసనలు తెలిపారు. 

గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని.. వేతనాలు పెంచమంటే పట్టించుకోవడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావంతో ఐదేళ్లలో అన్ని ధరలు పెరిగినా తమకు జీతాలు మాత్రం పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వేతనం రూ.15 వేల నుండి రూ.18 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. 

గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్‌ హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు, స్టేషన్స్ బాధ్యతలు చూస్తోంది. ఈ బాధ్యతలను ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ.. సబ్ కాంట్రాక్టు ద్వారా కియోలిస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థే ఉద్యోగ నియమాకాలు చేపట్టింది. అయితే.. జీతాల విషయంలో మాత్రం కియోలిస్ సంస్థ నిరక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 

అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని మెట్రో ప్రాజెక్ట్ లో పని చేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులు డిమాండ్ చేశారు. మెట్రోస్టేషన్స్ లో టికెటింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరో రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. 

హెచ్‌ఎంఆర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన

మరోవైపు మెట్రో కాంట్రాక్టు సిబ్బంది ఆందోళనలపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్ స్పందించింది. కొంతమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి..హైదరాబాద్ మెట్రో ట్రైన్ కార్యకలాపాలకు అవాంతరాలు కలిగించారని హెచ్‌ఎంఆర్‌ మేనేజ్‌మెంట్‌ ఆరోపించింది. మెట్రోట్రైన్ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పేర్కొంది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపింది. మెట్రో ట్రైన్ కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని తెలిపింది.

కాంట్రాక్టు సిబ్బందితో చర్చలు 

మెట్రో టికెటింగ్‌ సిబ్బందితో కియోలిస్ ఏజెన్సీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమీర్ పేట మెట్రో స్టేషన్  లో ఐదుగురు టికెటింగ్ సిబ్బందితో చర్చలు నిర్వహించారు.