ఇక కరెంట్ వైర్లు కనపడవ్ .. గ్రేటర్ హైదరాబాద్‌ లో అండర్ గ్రౌండ్ కేబుళ్లు!

ఇక కరెంట్ వైర్లు కనపడవ్ .. గ్రేటర్ హైదరాబాద్‌ లో అండర్ గ్రౌండ్ కేబుళ్లు!
  • బెంగళూరు తరహాలో ఏర్పాటుకు నిర్ణయం
  • ఫీడర్స్​ వారీగా కొనసాగుతున్న సర్వే
  • మొదటి దశలో మెయిన్​ రోడ్ల పక్కన..
  • ఆ తర్వాలే బస్తీలు, కాలనీలపై దృష్టి

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్​లో భారీ వానలు పడినా, జోరు గాలులు వీచినా చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోవడం శరామామూలే. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి అండర్​గ్రౌండ్ ​కేబుళ్లపై టీజీఎస్​పీడీసీఎల్ సన్నాహాలు చేస్తున్నది. కరెంట్​వైర్లు, కేబుళ్లు బయటకు కనిపించకుండా భూగర్భంలో లైన్స్​ వేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నది. బెంగళూరులో అండర్​గ్రౌండ్​ కేబుళ్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని అధికారులు చెప్తున్నారు. అక్కడ అండర్​గ్రౌండ్ కేబుళ్లు​ఏ విధంగా పనిచేస్తున్నాయన్న విషయంపై రెండు నెలల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్​ఇంజినీర్లతో కలిసి పరిశీలించి వచ్చినట్టు సమాచారం.

 అండర్​గ్రౌండ్​కేబుళ్లతో అక్కడ​చాలా సమస్యలు పరిష్కారం కావడంతో గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోనూ వేసే విషయంపై ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ఏఏ ప్రాంతాల్లో ఓవర్​హెడ్​ కేబుళ్లు ఉన్నవి, అండర్​గ్రౌండ్​కేబుళ్లు​ఎక్కడెక్కడ వేయాలన్న విషయంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫీడర్ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రధాన రోడ్లపై ఉన్న  ఓవర్​హెడ్​కేబుళ్లను తొలగించి అండర్​గ్రౌండ్​కేబుళ్లు​వేయాలని నిర్ణయించారు. దీని తర్వాతనే బస్తీలు, కాలనీల్లో కూడా అండర్​గ్రౌండ్​ కేబుళ్లు​వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టీజీఎస్​పీడీసీఎల్ మెట్రోజోన్​ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఇవీ ప్రధాన సమస్యలు..

ఓవర్​హెడ్​లైన్స్​వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడినా, జోరు గాలులు వీచినా చెట్లు, స్తంభాలు కూలుతున్నాయి. ప్రతి వేసవిలోనూ కరెంట్​తీగలను ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడానికి ఏటా కొంత మొత్తాన్ని అధికారులు కేటాయించాల్సి వస్తున్నది. చెట్లను ఆనుకుని ఉండే విద్యుత్​లైన్​లు తరచూ తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్​సమస్యలతోపాటు కొన్నిసార్లు పాదచారులు కరెంట్​షాక్​లకు గురవుతున్నారు. ఓవర్​హెడ్​కరెంట్ కేబుళ్లు​ఉన్న చాలా ప్రాంతాల్లో లైన్ల కింద భవనాలు పెరుగుతున్నాయి. 

ఈ భవనాలపైకి వెళ్లి బట్టలు ఆరేసుకునే మహిళలు కరెంట్​షాక్​కు గురవుతున్నారు. సంక్రాంతి వేళ పతంగులు ఎగురవేసే యువత కూడా కరెంట్​షాక్​ల బారిన పడుతున్నారు. ఓవర్​హెడ్ కేబుళ్ల వల్ల వచ్చే సమస్యలతో కరెంట్ సరఫరాలోనూ తరచూ అంతరాయం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు. అండర్ గ్రౌండ్​ కేబుళ్లు ఏర్పాటుచేస్తే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అధికారులు చెబుతున్నారు. 

సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలు

ప్రస్తుతం సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు ఉన్నారు. సబ్​స్టేషన్​లు, ఫీడర్లు, ఓవర్​హెడ్​ లైన్లు, విద్యుత్​ స్తంభాలను వీరు గుర్తించి అండర్​గ్రౌండ్​ లైన్స్​కు ఎంత మేరకు ఖర్చవుతుందన్న నివేదికను వారు అందజేస్తారు. దానిని అనుసరించి గ్రేటర్​లో అండర్​గ్రౌండ్​ కేబుళ్ల​ వ్యవస్థ ఏర్పాటుపై ముందుకు పోవాలని భావిస్తున్నారు.  

గ్రేటర్​లో ఇదీ లెక్క..

గ్రేటర్​పరిధిలో ఉన్న 60 లక్షల విద్యుత్​కనెక్షన్లలో దాదాపు 52 లక్షలు గృహ విద్యుత్​కనెక్షన్లే. పాతబస్తీతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలంలో వేసిన ఓవర్​హెడ్​ లైన్సే​ఉన్నాయి. వీటిలో చాలా వరకు శిథిలావస్థకు చేరినట్టు అధికారులు గుర్తించారు. నగరంలో విద్యుత్​ వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు 60 నుంచి 65 మిలియన్​యూనిట్ల వినియోగం జరిగితే.. వేసవి, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 85 నుంచి 90 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ వినియోగం అవుతోంది.

 ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో 33 కేవీ సబ్​స్టేషన్​లు 498 ఉండగా, 33 కేవీ అండర్ గ్రౌండ్​ కేబుళ్లు​ 1,280 కి.మీ.మేరకు ఉన్నాయి. అలాగే 33 కేవీ ఓవర్​హెడ్​ కేబుళ్లు​ 21,640 కి.మీ. ఉన్నాయి. పవర్​ ట్రాన్స్​ఫార్మర్లు​ 1,022 ఉన్నట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్​ పరిధిలో అండర్​ గ్రౌండ్​ కేబుల్స్​ వ్యవస్థ ఏర్పాటయితే ప్రమాదాలు తగ్గి, కరెంట్ సప్లై​ మరింత మెరుగవుతుందని డిస్కం అధికారులు భావిస్తున్నారు.