ధూల్పేట్: గంజాయి అమ్మకాలపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో సుమారు 100 మందిని అరెస్ట్ చేశారు. మరో వారం రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు.
‘గంజాయి అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. బుధవారం రాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్లో సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నాం. మరో వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. గంజాయి కొనడానికి నిన్న రాత్రి వంద మంది వరకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్నాం. వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. రెండోసారి ఇదే నేరం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. ధూల్ పేట్ నుంచి గంజాయి నిర్మూలించాలనేదే మా ప్రయత్నం. బయట రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మే వారి పైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. దీంట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. గంజాయి కొన్నా, అమ్మినా, తాగినా నేరమే’ అని శ్రీనివాస్ స్పష్టం చేశారు.