అమీర్పేట్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ సీనియర్ నటుడు, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణ మురళి మధ్య నడుస్తున్న వివాదం మరింతగా రాజుకుంది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఎలా కామెంట్లు చేస్తావంటూ పవన్పై పోసాని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తట్టుకోలేక ప్రెస్క్లబ్లో మాట్లాడుతున్న పోసానిపై దాడికి యత్నించారు. అయితే దగ్గర్లో ఉన్న పోలీసులు వారిని అడ్డకున్నారు. పోలీసు వాహనంలో పోసానిని సురక్షితంగా తీసుకెళ్లారు. ఇది జరిగి రెండ్రోజులు కాకముందే తాజాగా పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.
అమీర్పేట్కు సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు. పోసానిని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పోసాని ఇంట్లోనే ఉన్నాడని అనుకున్న దుండగులు.. బూతులు తిడుతూ రాళ్లు, ఇసుక విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాచ్ మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. పోసాని ఫ్యామిలీ 8 నెలలుగా వేరే చోట ఉంటున్నారని తెలిసింది. సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు వాచ్ మెన్ ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు.