
బీజేపీ అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న తనకు నోబెల్ బహుమతిని ఇవ్వాలని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచి తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నందని ఆరోపించారు. తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ గల్లీకి వెళ్లినా తాము మిమ్మల్నే నమ్ముకున్నామని అంటున్నారని మీరే జీవితాలను మార్చాలని జనం చెబుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో తనను పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. వాళ్ల పిల్లలతో సామానంగా సామన్యుల పిల్లలు కూడా చదువుకోవడం బీజేపీ పాలకులకు అస్సలు ఇష్టంలేదని కేజ్రీవాల్ విమర్శించారు.
బీజేపీ కుట్రలను ఎదుర్కొంటూ ఢిల్లీలో పరిపాలన ఎలా కొనసాగిస్తున్నానో తనకు మాత్రమే తెలుసని అన్నారు. అందుకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ వాసులు సరైన సమాధానం చెబుతారని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.