
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వారసత్వ పార్టీ అన్న ముద్ర పోవాలంటే తాను రాజీనామా చేయకతప్పదంటున్న రాహుల్ గాంధీ నిర్ణయం మేలు కంటే కీడే చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్ కోరినట్లు కొత్త చీఫ్ ఎన్నికకు హైకమాండ్ అంగీకరించిందన్న వార్తలతో దేశవ్యాప్తంగా నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నెహ్రూ ఫ్యామిలీ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ నడబలేదని బలంగా నమ్మే నేతలందరూ పార్టీని వీడతారన్న చర్చ నడుస్తున్నది. మంగళవారం పలు ప్రాంతాల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆ చర్చను బలపర్చేలా ఉన్నాయి.
సొంత దారిలో సచిన్?
అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ను వీడే నేతల జాబితాలో ఆయన ఆప్తమిత్రులే టాప్లో ఉన్నట్లు తెలుస్తున్నది. గడిచిన 15 ఏండ్లుగా రాహుల్ మద్దతుతో ఎదిగిన సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, తరుణ్ గొగొయ్లాంటి యువనేతలు తలోదారి చూసుకోబోతున్నట్లు సమాచారం. రాజస్థాన్ పీసీసీ చీఫ్గా ఐదేండ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన సచిన్ పైలట్.. కేవలం రాహుల్ సూచన మేరకే సీఎం పోస్టును అశోక్ గెహ్లాట్కు వదిలేసి డిప్యూటీ పదవితో సరిపెట్టుకున్నారని, రాహులే లేని పక్షంలో సచిన్ కూడా పార్టీలో ఉండరని రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త చెప్పారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడతారని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేపడతారని కార్యకర్తలు అంటున్నారు.
అంతటా అదే దారి
రాహుల్ రాజీనామా తర్వాత రాజస్థాన్తోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలోనూ ప్రభుత్వాలు కూలిపోతాయన్న చర్చ కూడా నడుస్తున్నది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా కనిపించే కాంగ్రెస్లో డిసిప్లిన్ గాడి తప్పుతుందని, నెహ్రూ ఫ్యామిలీ వాళ్లే పార్టీని ముందుకు నడిపించగలరని మెజార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారు.