గోపన్పల్లి భూమి వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్పై వేటు
భూమి మ్యుటేషన్ విషయంగా శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు
రేవంత్రెడ్డి, అతని సోదరుని పేరు మీద మ్యుటేషన్
కలెక్టర్ నివేదిక అందిన గంటల్లోనే సీఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: భూమి మ్యుటేషన్ వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్గా పని చేసినప్పుడు శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి విలేజ్ 127వ సర్వే నంబర్లోని భూమిని నిబంధనలు పాటించకుండా భూమి మ్యుటేషన్ చేశారంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ వేటు ఉంటుందని, ముందస్తు అనుమతి లేకుండా శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని అన్నారు. గోపన్పల్లి గ్రామంలోని 127 సర్వే నంబర్ భూమి మ్యుటేషన్పై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తప్పుడు డాక్యుమెంట్లతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి పేరిట ఈ సర్వే నంబర్లోని 6 ఎకరాల 24 గుంటల భూమిని శ్రీనివాస్రెడ్డి మ్యుటేషన్ చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై రంగారెడ్డి కలెక్టర్ విచారణ చేసి సీఎస్కు నివేదిక సమర్పించారు. నివేదిక అందిన గంటలోనే సస్పెన్షన్ ఉత్తర్వులను సీఎస్ జారీ చేశారు. ఈ విషయమై శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా సస్పెన్షన్ గురించి తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. 2016లో జరిగిన మ్యుటేషన్పై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని చెప్పారు.
ఆ అధికారం సివిల్ కోర్టులదే: రెవెన్యూ సంఘాలు
ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం భూమి మ్యుటేషన్లలో తప్పు జరిగితే బాధితులు అప్పీల్కు వెళ్లొచ్చని, ఈ విషయంలో తప్పెవరిదో తేల్చే అధికారం సివిల్కోర్టులకే ఉందని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు.
For More News..