పాలమూరులో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లపై సైలెన్స్!

పాలమూరులో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లపై సైలెన్స్!

పాలమూరులో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లపై సైలెన్స్!
15 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని సీఎం హామీ
నెల దాటినా ఆఫీసర్లకు ఎలాంటి ఆదేశాల్లేవ్​
గతంలో మంజూరు చేసిన ఇళ్లల్లో 40 శాతమే పూర్తి

మహబూబ్​నగర్, వెలుగు : ‘ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి డబుల్​ఇండ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఇక్కడ ఇంప్లిమెంట్​చేసిన తర్వాత రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు ఇండ్లు కేటాయిస్తాం. రానున్న పది, పదిహేను రోజుల్లో ఖాళీ జాగాలు ఉన్నవాళ్లకి రూ.3 లక్షలతో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు మంజూరు చేయిస్తాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరు తయారు చేసుకుందాం.’ 

– డిసెంబరు 4న పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రకటించి నెల రోజులవుతున్నా ఇంత వరకు అదనంగా వెయ్యి డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 14 వేల డబుల్​ఇండ్లు నిర్మించాల్సి ఉంది. గతంలో ఒక ఇంటి నిర్మాణానికి సర్కారు రూ.5.50 లక్షలు కేటాయించగా, పట్టణ ప్రాంతాల్లో మరో  రూ.50 వేలు కలిపి రూ.6 లక్షల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుతం పెరిగిన ఇనుము, సిమెంట్​ధరలతో పోలిస్తే ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. దీనికితోడు భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా పల్లె ప్రాంతాల్లోనే ఎకరం విలువ దాదాపు రూ.30 లక్షలకుపైగా ఉంది. అలాగే డబుల్​ ఇండ్లకు సంబంధించి హౌసింగ్, పంచాయతీరాజ్​ఆఫీసర్లతో ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటివరకు సమావేశాలు, సమీక్షలు నిర్వహించలేదు.  అదనపు ఇండ్ల కేటాయింపునకు సంబంధించి అర్హులుగా ఎవరిని గుర్తించాలి? గతంలో ఎంతమంది ఈ స్కీం ద్వారా లబ్ధి పొందారు? ఎక్కడెక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భూమి అందుబాటులో ఉంది? పెరిగిన రేట్లకు తగ్గట్లు ఇంటి నిర్మాణానికి ఎంత అవుతుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. సీఎం చెప్పినట్లు అదనంగా డబుల్​ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ఆఫీసర్లకు సమాచారం కూడా రాలేదు. ఈ విషయంపై కొందరు ఆఫీసర్లను ప్రశ్నించగా అదనపు డబుల్​ఇండ్ల కేటాయింపు గురించి సీఎం కేసీఆర్​ చెప్పినట్లు పేపర్లలో చదివామే తప్ప తమకు ఎలాంటి ఆర్డర్స్​రాలేదని చెప్పారు.

ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెన్స్​

ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రెగ్యులర్​గా డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​లో పాల్గొంటున్నారు. కానీ, ఎక్కడా నియోజకవర్గాలకు అదనపు డబుల్​ఇండ్ల గురించి ప్రస్తావన తేవడం లేదు. ప్రతి స్కీం గురించి గొప్పలు చెప్పుకొనే లీడర్లు దీని గురించి చప్పుడు చేయడం లేదు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు లోకల్​లీడర్లు ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. నియోజకవర్గాల వారీగా ఎంత మందికి డబుల్​ ఇండ్ల అవసరం ఉంది, జాగాలు ఉన్నవాళ్లు ఎంత మంది అనే విషయాలపై సమాచారం కూడా సేకరించడం లేదు.