దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో  పెరుగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి చేరుకుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ ఉదయం వరకు 2,14,242 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..  7,830 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది.

ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.09 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.65 శాతం.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉన్నట్లుగా ప్రకటించింది. రికవరీ రేటు 98.72 శాతం.. మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 11) రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది కోవిడ్ వైరస్ బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పాజిటివిటీ రేటు 25.98 శాతానికి పెరిగింది.

ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20,16,101కి చేరాయి. ఇందులో 26,545 మంది మరణించారు. 2876 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 170 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని కోరారు. మహారాష్ట్రలోని ముంబైలో అధికారులు కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ముంబైలోని దవాఖానల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ బృహిన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) నిర్ణయం తీసుకుంది.