- బీఆర్ఎస్నుంచి వెళ్లిన నేతలే కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ
- నేతల వెంట భారీగా తరలివెళ్లిన క్యాడర్
- క్యాడర్ కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల తిప్పలు
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆ పార్టీ పాత నేతలు గండంగా మారారు. బీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో కేడర్ను తీసుకుని ఇతర పార్టీల్లో చేరిన పలువురు నేతలు బీఆర్ఎస్ మీదే పోటీకి దిగారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎంపీ టికెట్లు తెచ్చుకుని, బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఓట్లు చీలిపోయి, బీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం కలుగుతుందన్న ఆందోళన గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు గ్రామ, మండల స్థాయి బీఆర్ఎస్ నేతలను తిరిగి పార్టీలోకి రప్పించడంపై బీఆర్ఎస్ అధిష్టానం గురి పెట్టింది. అయితే, గెలిచినా.. ఓడినా స్థానికంగా తమకు అండగా ఉంటాడన్న భావనతో, బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులతో ఉండేందుకే స్థానిక నేతలు మొగ్గు చూపుతున్నారు. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ బుజ్జగింపులతో కొంత మంది బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా.. ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న తమ నాయకులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది.
ఇలా మారి.. అలా టికెట్ తెచ్చుకున్నరు
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్, కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్సభనుంచి బరిలో నిలిచారు. రెండు టర్మ్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావుగౌడ్ ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయి గులాబీ పార్టీకే నష్టం వాటిల్లనున్నది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ జీ నగేశ్ ఇప్పుడు ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య.. వరంగల్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా వదిలేసి, కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు.
ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో మాజీ మంత్రి మహేందర్రెడ్డి భార్య సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఆమె మొన్నటి వరకూ బీఆర్ఎస్లోనే ఉండి వికారాబాద్ జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్లోనూ ఆయన పట్ల సానుభూతి ఉండటంతో, ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు మూడు పార్టీల అభ్యర్థుల నడుమ చీలిపోయే అవకాశం ఉన్నది. ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేశారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్.. బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున బరిలో నిలిచారు.
నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. తన కొడుకు పోతుగంటి భరత్కు టికెట్ ఇప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఓట్లు భరత్కే పడే చాన్స్ కనిపిస్తున్నది. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున నల్గొండ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పనిచేసిన సీతారాం నాయక్.. ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఈ 9 మందితో పాటు గతంలో భువనగిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన బూర నర్సయ్యగౌడ్ సైతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేశారు.