ముంబై: అక్రమాస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్కు సంబంధించి పలు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్ల పైగా బినామీ ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించి అటాచ్ చేసినట్లు సమాచారం. వీటిలో సౌత్ ఢిల్లీలో రూ.20 కోట్లు విలువైన ఓ ఫ్లాట్, నిర్మల్ హౌస్లో ఉన్న పవార్ ఆఫీసు విలువ రూ.25 కోట్లు, జరందేశ్వర్లో రూ.600 కోట్ల విలువైన షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్ల ఖరీదు చేసే రిసార్ట్లను బినామీ ఆస్తులుగా ఐటీ అధికారులు గుర్తించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలోనూ అజిత్ పవార్కు సంబంధించి మరికొన్ని ఆస్తులను ఐటీ శాఖ గుర్తించింది. వీటి విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఆస్తులన్నీ అజిత్తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించినవిగా చెబుతున్నారు. ఈ ప్రాపర్టీలను తన అక్రమార్జనతో బినామీ పేర్ల మీద కొనలేదని 90 రోజుల్లోగా అజిత్ పవార్ నిరూపించుకోవాల్సి ఉంది. ఏదో ఒకటి తేలేవరకు ఈ ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లుగానే ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఈ కేసులో ఐటీ శాఖ విచారణ పూర్తయ్యేదాకా అజిత్ పవార్ తన ఆస్తులను విక్రయించడానికి వీల్లేదు.