జూలై 31లోపు పన్ను కట్టాల్సిందే..

జూలై 31లోపు పన్ను కట్టాల్సిందే..

న్యూఢిల్లీ: తమ ఖాతాలకు ఆడిటింగ్​ అవసరం లేనప్పటికీ, చెల్లించాల్సిన పన్ను (సెల్ఫ్​ అసెస్​మెంట్​ ట్యాక్స్​) మొత్తం రూ.లక్ష  ఉంటే, జూలై 31లోపు కట్టాలని ఐటీశాఖ స్పష్టం చేసింది. ఐటీఆర్​ ఫైలింగ్​కు సెప్టెంబరు దాకా గడువు ఇచ్చినా, ఇండివిజువల్స్​ పన్ను బాధ్యత రూ.లక్ష దాటిన వారికి మాత్రం అదనపు సమయం ఇవ్వలేదని తెలిపింది. టీడీఎస్​, అడ్వాన్స్​ ట్యాక్స్ మొత్తాన్ని తీసేసిన తరువాత కూడా రూ.లక్ష, అంతకంటే ఎక్కువ మొత్తం కట్టాల్సి ఉంటే, జూలైలోపే చెల్లించాలి. లేకపోతే వడ్డీ భరించాల్సి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరం కోసం ఐటీఆర్​ ఫైలింగ్​కు, ఫామ్​ 16 ఇవ్వడానికి కూడా గడువు పెంచినట్టు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు టీడీఎస్ సర్టిఫికెట్​ జారీ చేయడానికి గడువు పెంచినా, నాన్​–శాలరీ కేసుల్లో టీడీఎస్​ జారీకి మాత్రం గడువు పెంచలేదు. బ్యాంకులు వీరికి వచ్చే నెల 15లోపు 16ఏ సర్టిఫికెట్​ ఇవ్వాలి. వడ్డీ పొందినందుకు వసూలు చేసే టీడీఎస్​మొత్తాన్ని వాపసు పొందడానికి 16ఏ అవసరం. ఈ విషయమై డెలాయిట్​ ఇండియాకు చెందిన సరస్వతీ కస్తూరిరంగన్​ మాట్లాడుతూ ‘ఐటీఆర్​ ఫైలింగ్​కు అదనంగా టైమివ్వడం మంచిదే! అయితే ఆలస్యంగా రిటర్నులు వేసినందుకు వడ్డీ కట్టాల్సిందే. దీనివల్ల  ఇండివిజువల్స్​ పన్ను బాధ్యత రూ.లక్ష దాటిన వాళ్లు నష్టపోతారు”అని అన్నారు. అయితే సీనియర్​ సిటిజన్స్​ జూలై 31లోపు పన్ను కడితే, దానిని అడ్వాన్స్​ ట్యాక్స్​గా పరిగణిస్తారు. బిజినెస్​/వృత్తిపరమైన ఆదాయం లేనివారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది.