- పీఎం కిసాన్ సమ్మాన్, హర్ ఘర్ జల్కు రైతు బంధు, మిషన్ భగీరథ స్ఫూర్తి
- దళితులకు కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలె
- దళితబంధుపై సంగారెడ్డిలో మంత్రి రివ్యూ
- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో చేపడుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ సమ్మాన్గా, మిషన్ భగీరథను హర్ ఘర్ జల్ పథకంగా అమలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు అమలు చేస్తున్నా బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఆఫీసర్లతో దళితబంధుపై హరీశ్ సమీక్ష చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలోని 26 కోట్ల మంది దళితులకు బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది రూ.1.26 లక్షల కోట్లేనని, అవి సరిపోవని, బడ్జెట్లో మరిన్ని నిధులను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆయన డిమాండ్ చేశారు. నాడు దళితుల కోసం పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,198 కోట్లే ఖర్చు పెట్టిందని, తెలంగాణ వచ్చాక ఏడేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.24,114 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీకి ఉలిక్కిపాటు
ప్రభుత్వ స్కూళ్లల్లో ‘మన ఊరు–మన బడి’ పేరుతో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్ చెప్పేసరికి కాంగ్రెస్, బీజేపీలు ఉలిక్కిపడుతున్నాయని మంత్రి హరీశ్ అన్నారు. సర్కారుకు ఎక్కడ మంచిపేరొస్తదోనని రేవంత్, సంజయ్లు ఆగమైతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 1,03,657 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారని, కానీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు అసలు టీచర్లే లేరని చెప్తూ గుడ్డిగా ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 296 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 914కి పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ విద్యాలయం ఉండాలని, ఆ లెక్కన రాష్ట్రంలో ఇంకా 21 నవోదయలు రావాలని హరీశ్ అన్నారు. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు దమ్ముంటే కేంద్రంతో పోరాడి మిగతా నవోదయ విద్యాలయాలను మంజూరు చేయించాలని సవాల్ చేశారు. వాటితో పాటు ట్రైబల్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ, ఐటీఐఆర్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతు బంధు స్పూర్తితో ‘మన ఊరు–మన బడి’ని సీఎం కేసీఆర్ అమలు చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రైవేటుకు దీటుగా సర్కారు కాలేజీలు: హరీశ్
స్టూడెంట్లకు ఆన్లైన్ పాఠాలు చెప్పాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీలకు దీటుగా సర్కారు కాలేజీల్లో మెరుగైన సౌలతులు కల్పించి, విద్యాబోధన చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా కారణంగా స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని హరీశ్ రావు ఇంటిలో గవర్నమెంట్ కాలేజీల ప్రిన్సిపల్స్ సంఘం, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ 2022 సంవత్సర డైరీలను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపల్స్ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్తో కలిసి మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో సర్కారు కాలేజీలకు పూర్వవైభవం తీసుకొచ్చిన లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ను ఈ సందర్భంగా హరీశ్ అభినందించారు. వచ్చే విద్యాసంవత్సరంలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు కాలేజీలను డెవలప్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో స్టూడెంట్లకు మెరుగైన విద్యాబోధన చేస్తున్నామని మధుసూదన్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ విజయ శేఖర్, ఫైనాన్స్ సెక్రటరీ లక్ష్మి, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామానుజాచారి తదితరులు పాల్గొన్నారు.