- పెరిగిన బ్యాంకుల కన్జూమర్ లోన్లు
- ఫెస్టివ్ సీజన్లో కరోనా ముందు లెవెల్స్కు సేల్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి కొత్త కొత్త స్కీమ్లను తీసుకొస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ కంపెనీలతో సహా చిన్న, పెద్ద షాపులు ఈ ఫెస్టివ్ సీజన్ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీరి ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. తక్కువ వడ్డీకే లోన్లు దొరుకుతుండడంతో క్లాత్స్, మొబైల్ఫోన్స్ నుంచి హోమ్ అప్లెయెన్స్ల వరకు ఏ ప్రొడక్ట్నైనా కొనడానికి కన్జూమర్లు వెనకడుగు వేయడం లేదు. ‘బయ్ నౌ పే లేటర్’, ఈజీ ఈఎంఐ, ఇన్స్టంట్ లోన్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ దీపావళి టైమ్లో కంపెనీల సేల్స్ కరోనా ముందు స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు. వినియోగం పెరగడంతో దేశ ఎకానమీ రికవరీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో కన్జూమర్లు ఖర్చు చేయడం పెరిగిందని రిటైలర్లు చెబుతున్నారు. ఫైనాన్షియల్ సంస్థలు ఈ సారి కన్జూమర్ లోన్లు ఎక్కువగా ఇచ్చాయి. సంక్షోభం టైమ్లో ఫైనాన్షియల్ సంస్థలు తమ క్యాపిటల్ను పెంచుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీల దగ్గర అదనంగా డబ్బు ఉంది. తక్కువ వడ్డీకైనా లోన్లను ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. బారోవర్లు కూడా తక్కువ వడ్డీకే లోన్లు దొరుకుతుండడంతో అప్పులు తీసుకోవడానికి భయపడడం లేదు. పైగా నెలవారీ కిస్తీలకు అవకాశం ఉండటంతో అప్పులకు వెనకాడటం లేదు.
బ్యాంకుల లోన్లు పై పైకి..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిటెయిల్ లోన్లు సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో 12.9 శాతం ఎగిశాయి. కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత మొదటి సారిగా బ్యాంక్ రిటెయిల్ లోన్ బుక్ డబుల్ డిజిట్ గ్రోత్ను నమోదు చేసింది. యాక్సిస్ బ్యాంక్ రిటెయిల్ లోన్లు కూడా ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగాయి. గత ఐదు క్వార్టర్లో యాక్సిస్ బ్యాంక్ ఇంతలా లోన్స్ను ఇవ్వడం ఇదే మొదటిసారి. బజాజ్ ఫైనాన్స్ కన్జూమర్లకు ఇచ్చే లోన్లు సెప్టెంబర్ క్వార్టర్లో రికార్డ్ లెవెల్స్కు చేరుకున్నాయి. ‘ఫెస్టివ్ సీజన్ మొదలవ్వడం, వ్యాక్సినేషన్ వేగంగా జరగడం, ప్రభుత్వం కూడా తన ఖర్చులను పెంచడం వంటి వాటితో ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరుగుతోంది’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాసన్ వైద్యనాధన్ అన్నారు. రిటెయిల్ సెగ్మెంట్లో లోన్లు ఇవ్వడం పెరిగిందని ఆయన చెప్పారు. హెల్త్ సర్వీస్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రభుత్వం ఖర్చులు పెంచడంతో ఎకానమీ వృద్ధి చెందుతుందని, ప్రజల ఆదాయాలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకులు ఇచ్చిన పర్సనల్ లోన్లు 12.1 శాతం పెరిగాయి. కిందటేడాది ఇదే క్వార్టర్లో పర్సనల్ లోన్లు 8.4 శాతం మాత్రమే పెరిగాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, హౌసింగ్, వెహికల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఎక్కువగా పెరిగాయని ఆర్బీఐ డేటా ద్వారా తెలుస్తోంది. కేవలం బ్యాంకులే కాదు ఎన్బీఎఫ్సీలు కూడా కనీసం రూ. 10 వేల నుంచి లోన్లను ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.
ప్రైవేట్ బ్యాంకులే ముందు..
కరోనా టైమ్లో ప్రైవేట్ బ్యాంకులు ఏకంగా రూ. 53,600 కోట్లను సేకరించాయి. అదే ప్రభుత్వ బ్యాంకులు రూ. 12,000 కోట్లను మాత్రమే సేకరించాయి. బ్యాంకుల దగ్గర అదనంగా డబ్బులు ఉండడంతో వాటిని లోన్లను ఇవ్వడానికి వాడుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు కన్జూమర్ లోన్లను ఇవ్వడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం అన్ని సెక్టార్లలో ఎకానమీ రికవరీ అవుతోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా అన్నారు. దీంతో ఎటువంటి భయాలు లేకుండా లోన్లను ఇవ్వడానికి వీలవుతోందని చెప్పారు. కరోనా సెకెండ్ వేవ్ టైమ్లో కంటే గత కొన్ని నెలల్లో ఎకానమీ వేగంగా రికవరీ అవుతుండడాన్ని చూడొచ్చని బజాజ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జైన్ పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ లేకపోవడంతో ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఎకానమీ వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.