ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్.. 32 ఏళ్లలో తొలిసారి

ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్.. 32 ఏళ్లలో తొలిసారి

భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే ఆ మజానే వేరు. రెండు టాప్ జట్లు విజయం కోసం పోరాడే తీరు క్రికెట్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. బోర్డర్-గవాస్కర్ లో కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆ సంఖ్య పెరగనుంది. 32 ఏళ్ళ తర్వాత తొలిసారి 5 టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు తలపడనున్నాయి. చివరిసారిగా భారత్, ఆసీస్ జట్లు 1991-92 సంవత్సరంలో 5 టెస్టుల సిరీస్ లో తలపడ్డాయి.

1991-92 తర్వాత తొలిసారిగా భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ 5 మ్యాచ్‌లు జరగనుందని.. రాబోయే రోజుల్లో ఈ మ్యాచ్ ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుందని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్-జనవరిలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ ఐదు మ్యాచ్‌లు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఉంటాయి. ఈ సిరీస్ కు దాదాపుగా వేదికలు ఖరారైపోయాయి. 

Also Read :చెన్నైలో ఐపీఎల్ ఫైనల్.. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఎక్కడంటే..?

క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వేదికలను ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ లో జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా రెండో టెస్ట్,అడిలైడ్ వేదికగా మూడో టెస్టు డే నైట్ జరుగుతుంది. మెల్బోర్ వేదికగా నాలుగో టెస్టు, చివరిదైన ఐదో టెస్ట్ న్యూయర్ తర్వాత సిడ్నీ వేదికలుగా జరుగుతాయి. ఆస్ట్రేలియా గడ్డపై చివరి రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది.