లండన్: రెండో ప్రయత్నంలో అయినా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విన్నర్గా నిలవాలని ఆశిస్తున్న టీమిండియా అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. 7 నుంచి జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ముప్పును తిప్పికొట్టేందుకు రెడీ అవుతుంది. స్టార్క్ పదునైన లెఫ్టార్మ్ పేస్ను ఎదుర్కొనేందుకు సోమవారం ఓవల్ నెట్స్లో బ్యాటర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆప్షనల్ సెషన్ అయినప్పటికీ పేసర్లు ఉమేశ్, సిరాజ్, రిజర్వ్ ప్లేయర్ సూర్య తప్ప మిగతావాళ్లంతా పాల్గొన్నారు. దాదాపు రెండున్నర గంటల సెషన్లో బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్లో చెమటోడ్చారు.
జైదేవ్ ఉనాద్కట్, నెట్ బౌలర్ అనికేత్ చౌదరి, మరో లోకల్ బౌలర్ వారికి బౌలింగ్ చేశారు. తొలుత పుజారా, రహానె, గిల్, షమీ ప్రాక్టీస్ చేశారు. షమీ అరగంటకు పైగా సీరియస్గా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కాసేపు స్పిన్నర్లను ఎదుర్కొన్న కోహ్లీ తర్వాత పక్కనెట్లోకి వచ్చి షమీ, ఉనాద్కట్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేశాడు. తోటి ఆటగాళ్ల ప్రాక్టీస్ను కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి పరిశీలించిన కెప్టెన్ రోహిత్ శర్మ చివర్లో నెట్స్లోకి వచ్చాడు. అతను కేవలం త్రో డౌన్స్ మాత్రమే ఎదుర్కొన్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ ఇద్దరూ కీపింగ్ డ్రిల్స్ చేస్తూ కనిపించారు.