
టీ20 ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2) తొందరగానే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాహుల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. చివరకు షకీబ్ బౌలింగ్లో భారీ షాట్ కు ప్రయత్నించి ముస్తాఫిజర్ చేతికి చిక్కాడు.
ఆ తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, కోహ్లీతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో కోహ్లీ(61) మెరుపు ఇన్నింగ్స్ తో రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ రెండు వికెట్లు తీయగా, హసన్ మూడు వికెట్లు తీశారు. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు ఇరు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్ కావడం గమనార్హం.