
లివర్పూల్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియాకు తొలి పతకం ఖాయమైంది. విమెన్స్ +80 కేజీల్లో హెవీ వెయిట్ బాక్సర్ నుపురు షెరోన్ సెమీస్లోకి దూసుకెళ్లింది. కానీ, తెలంగాణ స్టార్, డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడి నిరాశ పరిచింది. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో నుపుర్ 4–1తో ఒటినోయ్ సొటింబోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. దాంతో కనీసం కాంస్య పతకమైనా ఖాయం చేసుకుంది. డైరెక్ట్గా క్వార్టర్స్ బౌట్ ఆడిన నుపుర్ స్టార్టింగ్ నుంచే పదునైన పంచ్లతో విరుచుకుపడింది. ఉజ్బెక్ బాక్సర్ స్ట్రయిట్ పంచ్లతో అడ్డుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. రెండో రౌండ్లో సొటింబోవా దూకుడుగా ఆడింది. వరుసగా పంచ్లు విసిరి ఆధిక్యం ప్రదర్శించింది. కానీ నుపుర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాయింట్లు సాధించింది.
చివరి రౌండ్లో సొటింబోవా అధిక హోల్డింగ్ కారణంగా ఒక్క పాయింట్ గెలిచింది. అయితే నుపుర్ తలను పట్టుకోవడంతో పాయింట్ను రద్దు చేశారు. 51 కేజీ క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 0–5తో టర్కీకి చెందిన బుసెనాజ్ చేతిలో ఓడిపోయింది. తొలి రెండు రౌండ్లలో ఆకట్టుకోలేకపోయిన నిఖత్.. మూడో రౌండ్లో పూర్తిగా ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించినా ఫలితం లేకపోయింది. ఇక, మంగళవారం రాత్రి జరిగిన బౌట్స్లో గెలిచి జాదుమణి సింగ్ (48 కేజీ), అభినాష్ జమ్వాల్ (65 కేజీ) క్వార్టర్స్కు చేరుకోగా, జుగ్నూ అహ్లావత్ (85 కేజీ) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు.