
హాంగ్జౌ (చైనా): విమెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఇండియా సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఇండియా అమ్మాయిలు.. రెండో పోరులో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను నిలువరించారు.
శనివారం జరిగిన ఈ మ్యాచ్ను 2-–2తో డ్రాగా ముగించారు. జపాన్ ప్లేయర్ హిరోకా మురయామా 10వ నిమిషంలో తొలి గోల్ కొట్టగా.. ఇండియా అమ్మాయి రుతజ దాదాసో 30వ నిమిషంలో స్కోరు సమం చేసింది. ఆపై ఆట హోరాహోరీగా సాగగా 58వ నిమిషంలో జపాన్కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దీనికి చికో ఫుజిబయాషి గోల్ చేసి ఆ టీమ్ను 2–-1 ఆధిక్యంలో నిలిపింది. అయితే మరి కొన్ని సెకండ్లలో ఆట ముగుస్తుందనగా నవనీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి ఇండియాను గట్టెక్కించింది.