
- రెడీమేడ్ గార్మెంట్స్కు కోల్కతా, నవా షెవా ఓడరేవులద్వారా మాత్రమే అనుమతి
- నార్త్ఈస్ట్లోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి పలు వస్తువుల ఇంపోర్ట్పై నిషేధం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ సహా ఇతర వస్తువుల దిగుమతులపై ఇండియా పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్కతా, ముంబైలోని నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు.
అలాగే నార్త్ఈస్ట్లోని 11 ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి సైతం పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి. కాగా, ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్కు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు. కాగా, భారత్కు ఏటా బంగ్లాదేశ్ 700 మిలియన్డాలర్ల విలువైన రెడీమేడ్ గార్మెంట్స్ను ఎగుమతి చేస్తున్నది. ఇందులో 93 శాతం ల్యాండ్ పోర్టుల ద్వారానే వస్తున్నది. తాజా ఆంక్షలతో బంగ్లాదేశ్పై భారీ ప్రభావం పడనున్నది. ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే భారత్ ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తున్నది.