
దుబాయ్: ఆసియా కప్ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించిన టీమిండియా ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. బౌలర్లకు తోడు బ్యాటింగ్లో కోహ్లీ, జడేజా, హార్దిక్ పాండ్యా మెప్పించడంతో ఉత్కంఠ పోరులో గెలిచినప్పటికీ రోహిత్సేన పలు బలహీనతలు బయటపెట్టింది. అందులో ప్రధానమైనది ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే గ్రూప్–ఎ రెండో, చివరి మ్యాచ్లో చిన్న జట్టు హాంకాంగ్పై సత్తా చాటి అతను తిరిగి గాడిలో పడాలని ఇండియా కోరుకుంటోంది. అదే టైమ్లో యువ ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చి ప్రయోగాలు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే అందరి ఫోకస్ మాత్రం రాహుల్ పైనే ఉంది. గాయం నుంచి కోలుకొని జింబాబ్వేతో వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కేఎల్ ఇబ్బంది పడుతున్నాడు. జింబాబ్వేపై రెండు మ్యాచ్ల్లో 1,30 స్కోర్లతో నిరాశ పరిచిన అతను గత పోరులో పాక్ యంగ్ పేసర్ నసీమ్ బౌలింగ్లో గోల్డెన్ డకౌటయ్యడు. సూపర్–4 దశలో పోటీ పెరగడంతో పాటు మరోసారి పాకిస్తాన్ను ఎదుర్కోనే అవకాశం ఉన్న నేపథ్యంలో కేఎల్ తక్షణమే ఫామ్ అందుకోవాలి. ఐపీఎల్తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్ భిన్నంగా కనిపిస్తోంది. డిఫెన్సివ్ మైండ్సెట్తో ఆడి ఫెయిలవుతున్నాడు. టీ20ల్లో శుభారంభాలు చాలా ముఖ్యం. భారీ స్కోర్లు చేయకున్నా.. తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేస్తే జట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్ను సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కేఎల్ ఫామ్లోకి రావడం అతనితో పాటు జట్టుకు చాలా ముఖ్యం. అనామక హాంకాంగ్తో మ్యాచ్ను సద్వినియోగం చేసుకొని ఫోర్లు, సిక్సర్లతో టచ్లోకి వస్తే మంచిది. ఇక, తన స్టయిల్కు భిన్నంగా పాక్పై అతి జాగ్రత్తగా ఆడి ఫెయిలైన కెప్టెన్ రోహిత్ కూడా భారీ షాట్లతో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తన వందో టీ20లో కోహ్లీ బాగానే ఆడినప్పటికీ.. ఫ్యాన్స్ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. టీమ్లో ప్రయోగాలు కొనసాగుతాయని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేసిన నేపథ్యంలో తుదిజట్టులో మార్పులు ఖాయమే అనొచ్చు. ప్రత్యర్థి చిన్న జట్టే కాబట్టి పలువురిని పరీక్షించుకునే వీలుంది. సూర్యకుమార్, జడేజా, చహల్కు రెస్ట్ ఇచ్చి దీపక్ హుడా, అశ్విన్, బిష్నోయ్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్లో పంత్ను తప్పించడంపై విమర్శలు వచ్చాయి. సోమవారం జరిగిన నెట్ సెషన్లో రాహుల్తో పాటు తను కూడా చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి తుది జట్టులోకి రావొచ్చు. వర్క్లోడ్ దృష్ట్యా పేసర్ భువనేశ్వర్కు కూడా రెస్ట్ ఇస్తే ఎక్స్ట్రా బ్యాటర్గా కార్తీక్ను కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదు.
హాంకాంగ్ పోటీ ఇస్తుందా
ఆట చూసినా, ఆటగాళ్లను చూసినా టీమిండియాతో హాంకాంగ్ ఏమాత్రం సరితూగదు. క్వాలిఫయర్గా ఈ టోర్నీలోకి వచ్చిన హాంకాంగ్.. రోహిత్సేనకు కాస్త పోటీ ఇస్తేనే గొప్ప అనొచ్చు. ఈ ఫార్మాట్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఇది వరకు ఇండియాతో ఆడిన రెండు వన్డేల్లో హాంకాంగ్ ఓడిపోయింది. అయితే, 2018లో ఆడిన చివరి వన్డేలో హాంకాంగ్ ఆకట్టుకుంది. 286 రన్స్ ఛేజింగ్లో 259/8 చేసి సత్తా చాటింది. ప్రస్తుత కెప్టెన్ నిజాకత్ ఖాన్ నాడు కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. ఆ మ్యాచ్ స్ఫూర్తితో టీ20ల్లో టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని హాంకాంగ్ కృత నిశ్చయంతో ఉంది. ఆ జట్టు ప్లేయర్లు కుటుంబాలకు దూరంగా ఉండి క్రికెట్ ఆడుతున్నారు. ఇండియాపై రాణిస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ చాన్స్ ను వదులుకోకూడదని భావిస్తున్నారు. కెప్టెన్ నిజాకత్పై భారీ అంచనాలున్నాయి. ఇదే నెలలో జెర్సేపై సెంచరీ కొట్టిన అతను క్వాలిఫయర్స్లో కువైట్పై ఫిఫ్టీతో ఫామ్లో ఉన్నాడు. మరి, ఆ జట్టు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్(కెప్టెన్), రాహుల్, కోహ్లీ, పంత్ (కీపర్), హుడా, హార్దిక్, కార్తీక్, అశ్విన్, అవేశ్, బిష్ణోయ్, అర్ష్దీప్. హాంకాంగ్: నిజాకత్ ఖాన్ (కెప్టెన్), బాబర్ హయత్, యాస్మిన్, కించిత్, మెకెనీ (కీపర్), హరూన్, ఐజాజ్, జీషన్, ఎహ్సాన్, ఆయుష్ శుక్లా, ఘజాన్ఫర్.