సెల్హెట్: విమెన్స్ ఆసియా కప్లో లీగ్ స్టేజ్ను ఇండియా ఘన విజయంతో ముగించింది. సోమవారం జరిగిన చివరి లీగ్ పోరులో టీమిండియా 9 వికెట్ల తేడాతో చిన్న జట్టు థాయ్లాండ్ను చిత్తుగా ఓడించింది. ఓవరాల్గా ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి, పది పాయింట్లతో టాప్ ప్లేస్లో సెమీస్కు రెడీ అయింది. ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన థాయ్లాండ్ 15.1 ఓవర్లో 37 రన్స్కే కుప్పకూలింది.
ఓపెనర్ ననాపట్ (12) తప్ప మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా (3/9), రాజేశ్వరి గైక్వాడ్ (2/8), దీప్తి శర్మ (2/10) సత్తా చాటారు. అనంతరం చిన్న టార్గెట్ను ఇండియా 6 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది. సబ్బినేని మేఘన (20 నాటౌట్) రాణించింది. స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం సెమీఫైనల్స్ జరుగుతాయి.