చైనీస్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న రూ.700 కోట్ల విలువైన క్రిప్టోవాలెట్ పెట్టుబడి మోసానికి గురైన కనీసం 15 వేల మంది భారతీయులలో సాఫ్ట్ వేర్ నిపుణులు సైతం ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జులై 24న తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మోసానికి సంబంధించిన కొన్ని క్రిప్టోవాలెట్ లావాదేవీలు టెర్రర్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ లింక్లను కలిగి ఉన్నాయని తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలకు తెలియజేస్తున్నారని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధిత వివరాలన్నీ అందించామని సీపీ చెప్పారు. అత్యధిక వేతనం పొందుతున్న సాఫ్ట్వేర్నిపుణులు సైతం రూ.82 లక్షల వరకు డబ్బులు కోల్పోవడం బాధాకరమన్నారు.
'రేట్ అండ్ రివ్యూ' స్కామ్
పార్ట్టైం జాబ్ ఆఫర్ తో రేట్ అండ్ రివ్యూ అంటూ ఓ లింక్ క్లిక్ చేసి తాను మోసపోయానని ఓ బాధితుడు వాపోయాడు. రూ.వెయి పెట్టుబడితో రూ.25వేల లాభం అంటూ బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. చివరికి రూ.28 లక్షలు కోల్పోయాడు. టెలిగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా కనీసం 15 వేల మంది బాధితులు, సగటున 5-6 లక్షల రూపాయల నష్టాన్ని చవిచూశారు.
మోసానికి పాల్పడిన షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న 48 బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు. అప్పట్లో ఈ స్కాం అంచనా విలువ రూ.584 కోట్లు.అయితే, విచారణ జరుగుతున్నప్పుడే స్కామర్లు అదనంగా రూ. 128 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు. అక్రమ నగదు చివరికి క్రిప్టో కరెన్సీగా మార్చారు. ఈ డబ్బును దుబాయ్ మీదుగా చైనాకు తరలించారు.
తొమ్మిది మంది అరెస్ట్
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో - హైదరాబాద్కు చెందిన నలుగురు, ముంబైకి చెందిన ముగ్గురు, అహ్మదాబాద్కు చెందిన ఇద్దరున్నారని సీపీ తెలిపారు. మరో ఆరుగురు నిందితులు దుబాయిలో ఉన్నారని వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా రూ.712 కోట్ల ఈ స్కాంలో ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆనంద్సూచించారు.