ఇండియన్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు టైమ్ బాంబ్లా మారాయని, అవి ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియని పరిస్థితి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఈ రంగాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయని అన్నారు. ఈ రంగాలకు అప్పులిచ్చిన నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీల అసెట్ క్వాలిటీని తప్పనిసరిగా రివ్యూ చేయాల్సినవసరం ఉందని హెచ్చరించారు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్ర సంక్షోభం ఉందని ఇండియా టుడే మ్యాగజేన్కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. గ్రోత్ కూడా సంక్షోభంలో నడుస్తుందన్నారు. ఎకానమీ చాలా నెమ్మదిగా నడుస్తోందని, నిరుద్యోగం బాగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ క్వార్టర్ ముగింపులో విడుదలైన లెక్కల్లో ఇండియా జీడీపీ గ్రోత్ రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయి 4.5 శాతంగా నమోదైంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో సంక్షోభం ఉందని, మొండి బకాయిలు పెరుగుతుండటంతో బ్యాంకులు లోన్లు ఇవ్వడం తగ్గించాయని రాజన్ చెప్పారు.
ఎన్బీఎఫ్సీల అసెట్ క్వాలిటీ రివ్యూ చేయాలి..
నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీల(షాడో బ్యాంక్ల) అసెట్ క్వాలిటీ రివ్యూను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా చేపట్టాలని రాజన్ సూచించారు. అయితే టాప్ 50లో ఉన్న నాన్ బ్యాంక్ ఫైనాన్సియర్స్ను ఆర్బీఐ మానిటర్ చేస్తోందని, షాడో బ్యాంకింగ్ రంగంలోని మొత్తం అసెట్స్లో 75 శాతం వీటివేనని ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. అతిపెద్ద, అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఏ నాన్ బ్యాంక్ లెండర్ కూడా కుప్పకూలిపోవడానికి ఆర్బీఐ అనుమతించదని దాస్ స్పష్టం చేశారు. అయితే సుమారు 66 బిలియన్ డాలర్లు(రూ.4,70,560 కోట్లు) విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లు బ్యాంక్రప్ట్స్సీ ప్రొసీడింగ్స్లో ఉన్నాయని ఇటీవలే ఓ సర్వే పేర్కొంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ప్రకారం 4.54 లక్షల యూనిట్లు వాటి గడువు అయిపోయినా, ఇంకా కొనుగోలుదారుల చేతికి అందలేదు. దీంతో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో మ్యాక్సిమమ్ ఆస్తులు సంక్షోభంలోనే ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్స్సీ బోర్డు ఆఫ్ ఇండియా ప్రకారం రియల్ ఎస్టేట్ కేటగిరీ కింద 2019 సెప్టెంబర్ నాటికి మొత్తంగా ఫైల్ అయిన ఇన్సాల్వెన్సీ కేసులు 115 ఉన్నాయి. వాటిలో 87 కేసుల ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో ఉండగా.. 28 క్లోజ్ అయ్యాయి.