- డెత్ ఓవర్ల బౌలింగ్పై ఫోకస్
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
రాయ్పూర్: హైదరాబాద్ హై స్కోరింగ్ మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన టీమిండియా మరో సిరీస్పై గురి పెట్టింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్లో శనివారం జరిగే రెండో మ్యాచ్లో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టాలని చూస్తోంది. అదే టైమ్లో తమ మిడిలార్డర్ బ్యాటర్ల నుంచి మరికొన్ని పరుగులతో పాటు, డెత్ ఓవర్లలో బౌలర్ల నుంచి మంచి పెర్ఫామెన్స్ కూడా కోరుకుంటోంది. రాయ్పూర్లో జరుగుతున్న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో ఈ పోరుకూ ఫ్యాన్స్ పోటెత్తనున్నారు. మొత్తం 60 వేల పైచిలుకు టికెట్లు సేల్ అవడంతో హోమ్ టీమ్కు ఫ్యాన్స్ సపోర్ట్ దక్కనుంది. ఉప్పల్ పోరులో గెలిచినప్పటికీ కొన్ని సమస్యలను ఇండియా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 350 రన్స్ ఛేజింగ్లో ఓ దశలో 131/6తో నిలిచి చిత్తయ్యేలా కనిపించిన కివీస్కు మన బౌలర్లు మరో 206 రన్స్ ఇచ్చుకున్నారు. ఓ దశలో న్యూజిలాండ్ అద్భుతం చేసేలా అనిపించినా.. లోకల్ స్టార్ మహ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్ వల్ల ఇండియా గట్టెక్కింది. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఒక్కడే డబుల్ సెంచరీతో చెలరేగగా.. అవతలి ఎండ్లో అతనికి సరైన సపోర్ట్ దక్కలేదు. ఉప్పల్లో కివీస్ పోరాటం చూసిన తర్వాత ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదని అర్థమైంది. ఏడో నంబర్లో వచ్చిన బ్రేస్వెల్ వీరబాదుడు చూశాక.. ఆ జట్టు ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉంచినా తక్కువే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గిల్కు తోడు మిగతా వాళ్లు కూడా బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. శ్రీలంకపై రెండు సెంచరీల తర్వాత గత పోరులో ఫెయిలైన విరాట్.. కివీస్ స్పిన్నర్ శాంట్నర్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి. ఇషాన్ కిషన్.. బంగ్లాపై తన డబుల్ సెంచరీ గాలివాటం కాదని నిరూపించుకుంటాడేమో చూడాలి. ఫామ్లో ఉన్న సూర్యకుమార్ వన్డేల్లోనూ తన మార్కును చూపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మునుపటిలా ఇన్నింగ్స్కు తన మార్కు ఫినిషింగ్ టచ్ ఇస్తే ఇండియాకు ఢోకా ఉండదు.
బౌలర్లు మెప్పిస్తేనే..
బ్యాటింగ్ కంటే బౌలింగ్పైనే టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు తరచూ పట్టు విడవటం కలవరపెడుతోంది. వరల్డ్ కప్ సమీపిస్తుండగా ఈ బలహీనత నుంచి తక్షణం బయట పడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ కూడా చేయగలడని భావించిన మేనేజ్మెంట్ ఉమ్రాన్ మాలిక్ను కాదని శార్దూల్ ను తీసుకోవడం మైనస్ అయ్యింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ చేసే బౌలర్ కావాలా? ఎక్స్ ట్రా పేస్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే స్పెషలిస్ట్ పేసర్ కావాలా? అనే దానిపై మేనేజ్మెంట్ తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, రెండేళ్లుగా ఎంతో మెరుగైన సిరాజ్ పవర్ ప్లే, మిడిల్, స్లాగ్ ఓవర్లలో అదరగొట్టడం ప్లస్ పాయింట్. షమీ కొత్త బాల్తో మెప్పిస్తున్నా.. గత పోరులో బ్రేస్వెల్ ను అడ్డుకోలేకపోయాడు. హార్దిక్ అయితే ఓవర్కు పది కంటే ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. ఇండియా రాయ్పూర్లోనే సిరీస్ నెగ్గాలంటే ఈ ఇద్దరూ మెరుగవ్వాలి. ఇక, విలియమ్సన్, బౌల్ట్, సౌథీ లాంటి స్టార్లు లేకపోయినా అద్భుత పోరాటంతో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ అందరినీ ఆకట్టుకుంది. తొలి వన్డేలో చేజారిన విజయాన్ని రాయ్పూర్లో అందుకోవాలని బ్లాక్ క్యాప్స్ జట్టు భావిస్తోంది. రెండో పోరులో నెగ్గి సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. అది జరగాలంటే ఆ టీమ్ టాపార్డర్ రాణించాల్సి ఉంది. ఇష్ సోధి ఫిట్నెస్ సాధించి తుది జట్టులోకి వస్తే కివీల బలం పెరుగుతుంది.