ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ‘ఐఎఫ్ఎస్సీ’ తిప్పలు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ‘ఐఎఫ్ఎస్సీ’ తిప్పలు
  • ..ఇండ్ల బిల్లులు సరిగా వస్తలేవు
  • పాత ఐఎఫ్ఎస్​సీతో సమస్యలు 
  • ఆధార్​లో తప్పులు 
  • జియో ట్యాగింగ్​ప్లాన్​కు విరుద్ధంగా నిర్మాణాలు

యాదాద్రి, వెలుగు : ఐఎఫ్​ఎస్​సీ.. ఆధార్​ లో తప్పుల  కారణంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొందరు లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేసినా ప్లాన్​కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో విడతలవారీగా వచ్చే బిల్లుల విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని సరి చేయడానికి రెండు నుంచి మూడు వారాల టైమ్​పడుతోంది. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోంది. ఒక్కో ఇల్లుకు వంద శాతం సబ్సిడీతో నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. 

ఐఎఫ్​ఎస్​సీ తంటా..

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విషయంలో ఐఎఫ్ఎస్​సీ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) కారణంగా ఆటంకాలు కలుగుతున్నాయి. ఎస్ బీఐ, యూనియన్​బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు విలైనమైంది. ఈ కారణంగా విలీనమైన బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ నంబర్లు మారిపోయాయి. అయినప్పటికీ కొందరి వద్ద పాత బ్యాంకులకు సంబంధించిన నంబర్లే ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రధానంగా ఇతర బ్యాంకులు విలీనమైన ఎస్ బీహెచ్, ఆంధ్రా బ్యాంకు. ఏపీజీవీబీ అకౌంట్లే ఉన్నాయి.

ఇండ్ల బిల్లులకు సంబంధించి పాత అకౌంట్ల ఐఎఫ్​ఎస్​సీ నంబర్లనే పేర్కొనడంతో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు కలుగుతున్నాయి. కారణాలు తెలుసుకొని నంబర్లు చేంజ్​చేయడం, వాటిని పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది. సెంట్రల్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా అకౌంట్లు కలిగిన వారిది మరో సమస్య. ఆ బ్యాంకు సంబంధించి అకౌంట్ నంబర్​కు పదకొండు డిజిట్స్ కాకుండా పది డిజిట్స్​ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. సమస్య తెలుసుకొని ‘0’ కలిపి 11 డిజిట్స్​గా మార్చి అప్​లోడ్​ చేస్తున్నారు. 

ఆధార్ మరో సమస్య..

ఇండ్ల బిల్లులకు ఆటంకం కలగడానికి ఆధార్ మరో సమస్యగా మారింది. ఆధార్​లో ఎక్కువగా స్పెల్లింగ్​మిస్టేక్స్ ఉంటున్నాయి. దీంతో బ్యాంకులో ఉన్న పేరుకు ఆధార్​లో ఉన్న పేరు సెట్ కావడం లేదు. దీంతో ‘ఆధార్​మిస్ మ్యాచ్’ అని వస్తోంది. కొందరికి బేస్మెంట్​ బిల్లు వచ్చినా.. రెండో బిల్లు వచ్చే సమయానికి మిస్ మ్యాచ్​ అంటూ వస్తోంది. ​ 

ప్లాన్​ చేంజ్​ చేస్తే..

ఒక్కో లబ్ధిదారుడు ఇల్లు పూర్తి చేసేవరకు స్టెప్ ​బై స్టెప్​ ఫొటోలను అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం ముగ్గు పోసి జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ప్లాన్​లో ఎలాంటి చేంజ్ చేయకూడదు. కానీ కొందరు మారుస్తున్నారు. ఈ కారణంగా ఫొటో తీసి అప్​లోడ్​ చేస్తే ‘గో టూ నియర్ ప్లేస్’ అంటూ రిజెక్ట్​చేస్తోంది. దీంతోపాటు నిర్మిస్తున్న ఇంట్లో ‘ఎల్’  షేప్​లోనే కిచెన్ ఏర్పాటు  చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కచ్చితంగా సిమెంట్ భీమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు కిచెన్ నిర్మించకుండా ప్లాట్ ఫారం నిర్మిస్తున్నారు. దీంతో యాప్ ఆక్సెప్ట్​ చేయడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.

అదే విధంగా సైట్ ఓకే చేసిన చోట నిర్మిస్తున్న ఇల్లు ఎదురుగా నిలబడి లబ్ధిదారుడు ఫొటో తీయించుకోవాలి. అయితే నెట్ సమస్య కారణంగా కొందరు నెట్ వస్తున్న చోట నిలబడి ఫొటో తీయించుకొని అప్​లోడ్ చేస్తున్నారు. దీంతో లొకేషన్ చూపించడం లేదు. హౌసింగ్​ఆఫీసర్లను వచ్చి ఫొటో తీయాలని లబ్ధిదారులు కోరుతున్నా.. కొందరు రాకుండా రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల లబ్ధిదారులకు బిల్లు అకౌంట్లో జమ కావడం లేదు. ఈ విధంగా ఒక్క యాదాద్రి జిల్లాలోనే 300 మందికి పైగా బిల్లులు ఆగిపోయాయి. ఆధార్, ఐఎఫ్ఎస్​సీ వంటి వాటిని సరి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతోంది.

300 ఇండ్లకు బిల్లులు పెండింగ్..

జిల్లాలో 9,588 ఇండ్లు అలాట్ కాగా, 9,398 ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. వీటిలో 7,203 ఇండ్లు గ్రౌండ్​ అయ్యాయి. బేస్మెంట్​ లెవల్​లో 2,700 నిర్మాణాలు, 226 గోడల లెవల్, స్లాబ్​ లెవల్​కు 109 ఇండ్లు స్లాబ్​ లెవల్​కు చేరుకున్నాయి. 3 ఇండ్లు పూర్తయ్యాయి. కాగా జిల్లాలో 300 మందికి పైగా బిల్లులు ఆగిపోయాయి. ఆధార్, ఐఎఫ్ఎస్​సీ వంటి సమస్యలను సరి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.