మూడ్రోజులకో చిన్నారి మృత్యుఒడికి .. యాదాద్రి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు

మూడ్రోజులకో చిన్నారి మృత్యుఒడికి .. యాదాద్రి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు
  • 2023-24లో 128 మంది..
  • 2024-25లో 125 మంది మృతి

యాదాద్రి, వెలుగు: జిల్లాలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కండ్లు తెరిచి తెరవకముందే.. మృత్యుఒడికి చేరుతున్నారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపం, సరైన వైద్యం అందక, నెలలు  నిండకముందే జన్మించి కొందరు,  న్యూమోనియా, వివిధ రకాల వ్యాధులతో కొందరు చనిపోతున్నారని హెల్త్​ డిపార్ట్​మెంట్​లెక్కలు చెబుతున్నాయి 

హాస్పిటల్స్​అందుబాటులో ఉన్నా..

యాదాద్రి జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్​సీలు, భువనగిరిలో జిల్లా ఆస్పత్రి వైద్య సేవలందిస్తున్నాయి. ప్రైవేట్​ హాస్పిటల్స్​కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్​ దగ్గరగా ఉండడంతో ఎక్కువ మంది డెలివరీ కోసం కార్పొరేట్ ​హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో గతంతో పోలిస్తే మెరుగైన ట్రీట్​మెంట్​అందుతోంది. అయినా, చనిపోతున్న చిన్నారుల సంఖ్య తగ్గడం లేదు. పుట్టిన గంటల్లో కొందరు, కొన్ని రోజుల తర్వాత మరికొందరు మృతిచెందుతున్నారు. 

2024 ఏప్రిల్​ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 125 మంది పిల్లలు చనిపోయారు. ఈ లెక్కన రోజుకు ముగ్గురు చనిపోతున్నట్లే. 2025 జనవరి నుంచి మార్చి వరకు 27 మంది పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్​ హాస్పిటల్స్​లో చిన్నారులు మృతి చెందితే కొందరు మధ్యవర్తులు రంగప్రవేశం చేసి, డాక్టర్లు, మృతుల కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుపుతున్నారు. ఏంతో కొంత పరిహారం ఇప్పిస్తుండటంతో ఆ లెక్కలు పెద్దగా బయటకు రావడం లేదు. 

మగ పిల్లలే ఎక్కువ..

మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మగ పిల్లలే ఉంటున్నారు. ఇందుకు బరువు తక్కువగా ఉండడమే కారణం. న్యూమోనియాతో ఆడ శిశువులు మరణిస్తున్నారు. అయితే, ఈ రెండు కారణాలు కాకుండా ఇతర డిసీజ్​ల వల్ల చనిపోయిన వారిలో మగ శిశువులే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు మృతిచెందిన వారిలో గుండెకు రంధ్రం పడిన ఒక చిన్నారి కూడా ఉంది. 

రాత్రివేళల్లో ఉండని డాక్టర్లు

అవగాహన లోపం, పేదరికం కారణంగా ట్రీట్​మెంట్, పోషకాహారం విషయంలో గర్భిణులు శ్రద్ధ తీసుకోవడం లేదు. సర్కారు డాక్టర్లు ఎక్కువగా హైదరాబాద్ నుంచి హాస్పిటళ్లకు వచ్చి వెళ్తున్నారు. ప్రతీరోజు ఓపీకి ముందే గూగుల్​మీట్​నిర్వహిస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. గవర్నమెంట్ డాక్టర్లే కాదు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్​డాక్టర్లు కూడా పగలంతా ఇక్కడే ఉండి, రాత్రి వేళల్లో ఉండడం లేదు. పైగా కొన్ని ఏరియాల్లో అర్హత లేని వైద్యులు డెలివరీ చేస్తున్నా హెల్త్ డిపార్ట్​మెంట్ నుంచి పెద్దగా యాక్షన్​ ఉండడం లేదు.