- రూ.1.2 లక్షల విలువైన నగలు కూడా
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్లలో ఒకటైన ‘ఇన్ఫ్రా డాట్ మార్కెట్’ ఆఫీసులపై ఐటీ డిపార్ట్మెంట్ ఈ నెల తొమ్మిది నుంచి 12వ తేదీ వరకు దాడులు చేసింది. ఈ మూడు రోజుల సోదాల తరువాత చివరికి కేవలం రూ.రెండు వేల నగదును, రూ.1.2 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకుంది. ఠాణే, బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో ఈ దాడులు జరిగాయి. లెక్కల్లో చూపని డబ్బు గానీ, ఆస్తి గానీ దొరకలేదని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. ఇన్ఫ్రా డాట్కామ్ మార్కెట్ ను సోవిక్ సేన్గుప్తా, ఆదిత్య సర్దా నడిపిస్తున్నారు. సోవిక్ ఇంట్లో రూ.రెండువేల క్యాష్, రూ.1.2 లక్షల నగలు దొరికాయి. ఆదిత్య ఇంట్లో రూ.20 లక్షల విలువైన నగదు, నగలు దొరికినా, వాటిని విడిపించుకోవడానికి దరఖాస్తు ఇచ్చామని, అవి తన కుటుంబ సభ్యులవని ఆయన వివరించారు. జెట్వర్క్ అనే బీ2బీ యూనికార్న్ ఆఫీసులపైనా ఐటీ దాడులు జరిగాయి. వీటిసేవలు ఉపయోగించుకునే కొందరు సప్లయర్లు ట్యాక్సులు చెల్లించలేదనే అనుమానంతో దాడులు చేశామని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. మరికొన్ని స్టార్టప్లకు కూడా నోటీసులు పంపారని తెలిసింది. ‘‘త్వరలో ఫైనాన్షియల్ ఇయర్ ముగియనుంది. రెవెన్యూ పెంచుకోవడానికే ఐటీశాఖ ఇలాంటివి చేస్తుందేమో అనిపిస్తోంది’’ అని ఒక స్టార్టప్కు చెందిన ఇద్దరు వివరించారు. స్టార్టప్స్లో భారీగా పన్ను ఎగవేతలు ఉండే అవకాశాలు లేవన్నారు.