- చేతికి బాల్ తగిలి విలవిల
- కాసేపటి తర్వాత మళ్లీ ప్రాక్టీస్
అడిలైడ్: ఇంగ్లండ్తో కీలకమైన సెమీ ఫైనల్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద గాయం నుంచి బయటపడ్డాడు. మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన ఓ త్రో.. హిట్మ్యాన్ కుడి ముంజేతిని బలంగా తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. సాధారణంగా వేసిన బాల్.. లెంగ్త్ ఏరియాలో పడటంతో షార్ట్ పిచ్గా పైకి దూసుకొచ్చింది. దీనిని కెప్టెన్ ఫుల్షాట్ కొట్టే ప్రయత్నం చేయగా, మిస్ అయి చేతికి తగిలింది. వెంటనే ఐస్ ప్యాక్ అప్లై చేయడంతో గాయం తీవ్రంగా మారలేదు. 40 నిమిషాల తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘రెండోసారి ప్రాక్టీస్కు వచ్చినప్పుడు రోహిత్ సాధారణంగానే కనిపించాడు. కాబట్టి సీటీ స్కాన్, ఎక్స్రే అవసరం పడలేదు. బుధవారం మాకు ఆప్షనల్ ప్రాక్టీస్ ఉంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తాం. ప్రస్తుతానికైతే ఇది పెద్ద గాయం అయితే కాదు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రఘుపై రోహిత్ సీరియస్..
దెబ్బ తగిలిన వెంటనే రోహిత్ సీరియస్ అవ్వడంతో రఘు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. అయితే, అతడిని మళ్లీ గ్రౌండ్లోకి పిలిపించుకున్న హిట్మ్యాన్.. డిఫెన్స్ షాట్స్తో చేతిని పరీక్షించుకున్నాడు. తర్వాత రఘుతో నవ్వుతూ కనిపించాడు. ఇక, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. నెట్స్లో ఎక్కువగా షార్ట్ పిచ్ బాల్స్ను ప్రాక్టీస్ చేశాడు. సిరాజ్, శార్దూల్తో పాటు త్రో డౌన్ స్పెషలిస్టులతోనూ అలాంటి బాల్సే వేయించుకుని 40 నిమిషాలు ప్రాక్టీస్ చేశాడు.