గొర్రెలు, చేపల స్కీమ్స్ పై విజిలెన్స్​తో ఎంక్వైరీ

గొర్రెలు, చేపల స్కీమ్స్ పై విజిలెన్స్​తో ఎంక్వైరీ
  • అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
  • మండలానికో వెటర్నరీ హాస్పిటల్ 
  • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో వెయిటేజీ
  • వచ్చే నెల నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకాలు చెల్లింపు
  • పశుసంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గొర్రెలు, చేపల పంపిణీ పథకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పథకాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ తో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించాలని చెప్పారు. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏవైనా అవినీతి అక్రమాలను గుర్తిస్తే, ఆ వివరాలను వెంటనే ఏసీబీకి అందజేయాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌లో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ఇటీవల కాగ్ రిపోర్టులో వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా? అని అధికారులను ప్రశ్నించారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం మొదటి విడతకు రూ. 3,955 కోట్ల లోన్‌‌‌‌ ఇచ్చిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్.. రెండో విడతకు లోన్‌‌‌‌ ఎందుకు నిలిపివేసిందని అడిగారు.

 అయితే ఈ పథకంలో అవకతవకలు జరిగినట్టు కాగ్ గుర్తించడం, ఇతర కారణాలతో ఎన్సీడీసీ లోన్‌‌‌‌ ఇవ్వలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఇప్పటికే డీడీలు కట్టిన లబ్ధిదారులకు గొర్రెలు ఎందుకు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించగా.. ‘‘రెండో విడతలో 85,488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారు. దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయి. మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదు” అని అధికారులు వివరించారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై అనుమానాలు ఉన్నాయని, అలాగే చేప పిల్లల పంపిణీకి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ రెండు పథకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 

పాడి రైతులకు బకాయిలు రూ.203 కోట్లు.. 

పాడి రైతులకు ఒక్కో లీటర్ పై ఇచ్చే రూ.4  ప్రోత్సాహకం గత మూడేండ్లుగా ఇవ్వడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించి దాదాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి నెల గ్రీన్ చానెల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

‘‘మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలి. అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవండి. వివిధ పథకాల ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోండి. టీఎస్ పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఏండ్లకేండ్లుగా వెటర్నరీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లో పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలించండి. వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఇక్కడ వర్తింపజేయండి” అని సూచించారు.