
- ఎర్త్ అప్పర్ మ్యాంటిల్ వరకు చేరాలన్న ప్రయత్నం
- సముద్ర గర్భం నుంచి షిప్పులతో డ్రిల్లింగ్
- భూమి, జీవం రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయోగం
- ఇప్పటిదాకా తవ్విన లోతు 3 కిలోమీటర్లే
భూమి పుట్టినప్పుడు ఏం జరిగింది? డైనోసార్లు అంతరించిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులుండేవి? భూమి వేడెక్కినప్పుడు, చల్లగైనప్పుడు జీవులకు ఎదురైన అనుభవమేంటి? అసలు, మనం ఎటు పోతున్నామో కొన్ని కోట్ల ఏళ్ల వయసున్న భూమి చరిత్ర చెబుతుందా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి? బహుశా, వాటికి సమాధానాలు పాతాళంలో దాగి ఉన్నాయేమో!! అందుకే ఆ పాతాళాన్నే తవ్వేస్తే పోలే అనుకుంటున్నారు సైంటిస్టులు. అవును, గత నెలలో డైనోసార్ల అంతం గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నంలో సైంటిస్టులు న్యూజిలాండ్లోని మహాసంద్రంలో పరిశోధనలు సాగించారు. అంతుచిక్కని ప్రశ్నలకు జవాబులు దొరకబట్టేందుకు ఆ పరిశోధనలను మరింత ‘లోతు’కు తీసుకెళ్లాలని అనుకున్నారు. అందులో భాగంగానే పాతాళంపై దృష్టి పెట్టారు.
ఏడు కిలోమీటర్లు తవ్వుతరంట
ఇప్పటిదాకా పురాతన చరిత్ర గురించి సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తవ్వకాలు చేపడుతూ శిలాజాల ఆధారంగా ఆ చరిత్రకు అక్షర రూపం ఇస్తున్నారు. కానీ, అది కొంత వరకే. అయితే, మహా సముద్రాలు, భూ వాతావరణం, క్లైమేట్ వంటి వాటి లోగుట్టు అంతా సెడిమెంట్లలో ఉంటుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ మెరీన్ జియాలజీ సైంటిస్ట్ ఆంథోనీ కాపర్స్ చెబుతున్నారు. మరి, ఆ సెడిమెంట్లను తవ్వి తీయడం సాధ్యమేనా? సముద్ర గర్భం నుంచి తవ్వుకుంటూ పోతే సాధ్యమని అంటున్నారు. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు తవ్వేలా ప్లాన్ చేస్తున్నారు. భూమితో పోలిస్తే సముద్ర గర్భం నుంచి తవ్వితే అక్కడ భూమి మందం తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. సముద్ర గర్భం నుంచి తవ్వితే దగ్గరదగ్గర భూపటలం (మ్యాంటిల్) వరకు వెళ్లొచ్చని కాపర్స్ చెప్పారు.
ఇంతకు ముందు చేయలేదా?
నిజానికి ఈ పాతాళాన్ని తవ్వడమనే కాన్సెప్ట్ 1950లోనే మొదలైంది. మాట అయితే అనుకున్నారు కానీ, అది ముందుకు సాగలేదు. ప్రాజెక్ట్ మోహోల్ పేరిట 1960ల్లో అమెరికా మొదటి సారి ఆ ప్రయత్నం చేసింది. కానీ, 601 అడుగులు మాత్రమే తవ్వగలిగింది. ఆ తర్వాత అందివచ్చిన టెక్నాలజీతో 3,250 మీటర్లు (3.25 కిలోమీటర్లు) వరకు తవ్వగలిగింది జపాన్. అది కూడా గత ఏడాదే (2019) జరిగింది. చిక్యూ అనే జపాన్ షిప్ ఆ ఘనత సాధించింది. ఇప్పటిదాకా అత్యంత ఎక్కువ లోతు తవ్వింది ఆ ఓడే. అయితే, ఎంత లోతు తవ్వామన్నది కాదు.. దాని వల్ల మనం
ఏం సాధించాం.. ఏం తెలుసుకున్నామన్నదే ముఖ్యమంటున్నారు కాపర్స్. సముద్ర గర్భం నుంచి భూమి లోతుల్లోకి వెళ్లడం ద్వారా సముద్రం కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్ల తీరు, ఒకప్పుడు ఆర్కిటిక్లో సబ్ట్రాపికల్ క్లైమేట్, మీథేన్ ఐస్, సముద్ర గర్భంలో సూక్ష్మ జీవుల ఆనవాళ్ల వంటివి తెలిశాయి. అయితే, ఇప్పటిదాకా అంత లోతుకు తవ్వినా అది పైపైనేనని కాపర్స్ చెబుతున్నారు. దాని వల్ల సమాధానాలకు బదులు మరిన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయన్నారు. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకే మరింత లోతుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
పదేళ్ల జోయిడిస్ జర్నీ
జోయిడిస్ రిజల్యూషన్.. 41 ఏళ్లుగా డీప్ సీ డ్రిల్లింగ్లో పనిచేస్తున్న ఆయిల్ షిప్. ఇంటర్నేషనల్ ఓషన్ డిస్కవరీ ప్రోగ్రామ్ (ఐవోడీపీ)లో అది భాగమైంది. గత నెలలో న్యూజీలాండ్లోని క్యాంబెల్ ప్లాట్యూలో చివరిసారి తన డ్రిల్లింగ్ను చేసింది. కొన్ని శాంపిళ్లను సేకరించింది. ఆ శాంపిళ్లను ఆ షిప్లోని 118 మంది సైంటిస్టుల్లో ఒకరైన రట్గర్స్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలో, సెడిమెంటాలజిస్ట్ లారా హేన్స్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫిజికల్ ప్రాపర్టీస్ స్పెషలిస్ట్ ఎలిజబెత్ సైబర్ట్ కలిసి టెస్ట్ చేశారు. ఆ షిప్పు దాదాపు ఏడు కిలోమీటర్ల లోతు వరకు తవ్వగలదని కాపర్స్ చెప్పారు. అందుకు రెండు నెలల టైం పడుతుందన్నారు. ఆ క్రమంలో ఒక్క కిలోమీటర్ లోతు వరకు వెళ్లినా గొప్పేనంటున్నారు. ఇప్పటికే 5.55 కోట్ల ఏళ్ల క్రితం నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసే పాలియోసీన్ఇవోసీన్ థర్మల్ మ్యాగ్జిమమ్ను తెలుసుకునేందుకు ఇప్పటికే చాలా లోతు వరకు టీం తవ్విందని అన్నారు. ఇప్పుడు మరింత లోతుకు తవ్వేందుకూ ఆ షిప్నే వాడుకోవాలన్న ఆలోచనలో సైంటిస్టులున్నారు.
తర్వాతేంటి..?
ఇప్పుడు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమస్య కార్బన్ డయాక్సైడ్. ఫ్యూచర్లో ఆ కార్బన్డయాక్సైడ్ను సముద్రాలు ఎలా గ్రహిస్తున్నాయన్నది తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని కాపర్స్ చెప్పారు. వచ్చే ముప్పై ఏళ్లలో ఐవోడీపీ చేపట్టబోయే డీప్ ఎర్త్ ప్రయోగాల్లో భాగంగా అప్పర్ మ్యాంటిల్ వరకు చేరుకోవడం ఒక గోల్. దానికి దాదాపు ఏడాది టైం పడుతుందని కాపర్స్ చెప్పారు. అందుకోసం హవాయి సహా కొన్ని ప్రాంతాల గురించి చర్చిస్తున్నట్టు చెప్పారు. అయితే, అంత లోతుకు వెళుతున్నప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య టెంపరేచర్ అన్నారు. డ్రిల్ చేసి పైపును బయటకు తీసేటప్పుడు ఆ హోల్ ఆటోమేటిగ్గా పూడుకుపోతుందని, దానిని అధిగమించే టెక్నాలజీపైనా పనిచేయాల్సి ఉందని చెప్పారు. అలాంటి టెక్నాలజీ రావాలంటే మరో 20 ఏళ్లయినా పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం జోయిడిస్ రిజల్యూషన్ 900 మీటర్ల కోర్ సెడిమెంట్లను తవ్వింది. వాటిని తీసుకుని తీరానికి చేరబోతోంది.