న్యూఢిల్లీ: ఇండియా వేర్హౌసింగ్ సెక్టార్లో పెద్ద సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) వేర్హౌసింగ్, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ విభాగంలోకి 49 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.470 కోట్ల) ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని కన్సల్టింగ్ కంపెనీ వెస్టియాన్ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన 32 మిలియన్ డాలర్ల (రూ.307 కోట్ల) తో పోలిస్తే 53 శాతం పెరిగాయని తెలిపింది.
ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం, ముంబై, ఢిల్లీ- ఎన్సీఆర్, చెన్నై, కోల్కతా, పుణె, హైదరాబాద్, బెంగళూరులో వేర్హౌసింగ్, ఇండస్ట్రియల్ విభాగంలో లీజింగ్ 16శాతం పెరిగి 2.20 కోట్ల చదరపు అడుగులకు చేరింది. తయారీ రంగం విస్తరిస్తుండడంతో పాటు కన్జూమర్ డిమాండ్ బాగుండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడంతో వేర్హౌస్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో థర్డ్-పార్టీ లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, సేవలు, తయారీ, ఇంజనీరింగ్ సెక్టార్లు ఈ డిమాండ్ను నడిపిస్తున్నాయి.
అయినా, మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి వస్తున్న పెట్టుబడుల్లో వేర్హౌసింగ్ వాటా కేవలం 1శాతం మాత్రమే ఉంది. దీనిని బట్టి పెట్టుబడిదారులు కొంత జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో లీజింగ్ కార్యకలాపాలు, పెట్టుబడులు మరింత పుంజుకుంటాయని వెస్టియాన్ అంచనా వేస్తోంది.
