
- పడిపోయిన ఇన్వెస్టర్ల స్పందన
- మార్కెట్కు దూరంగా కొత్త తరం టెక్ కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) జోరు కనిపించలేదు.2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.52,116 కోట్లు సేకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సేకరించిన రూ.1,11,547 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 37 కంపెనీలు మాత్రమే ఐపీఓకి వచ్చాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 53 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ) ను టచ్ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానున్న విషయం తెలిసిందే. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఐపీఓల ద్వారా సేకరించిన ఫండ్స్లో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ నుంచే ఉన్నాయని, ఇది మొత్తం ఫండ్స్లో 39 శాతానికి సమానమని ప్రైమ్డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా అన్నారు. ఎల్ఐసీ ఐపీఓని పక్కన పెడితే మిగిలిన కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా సేకరించింది కేవలం రూ.31,559 కోట్లేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఐపీఓ ఫండ్ రైజ్లో 2022–23 మూడో అతిపెద్ద ఆర్థిక సంవత్సరంగా నిలిచిందని వివరించారు.
బాండ్ మార్కెట్తో కలిపి రూ.85 వేల కోట్లు
2022–23 ఆర్థిక సంవత్సరంలో షేర్ల ఇష్యూ ద్వారా ఫండ్స్ సేకరించడం భారీగా తగ్గింది. ఐపీఓలే కాకుండా ఇతర పబ్లిక్ ఇష్యూలు కూడా తగ్గిపోయాయి. ఐపీఓలతో సహా మొత్తం పబ్లిక్ ఇష్యూ (షేర్లు) ల ద్వారా రూ.76,076 కోట్లను కంపెనీలు సేకరించాయి. 2021–22 లో ఈ నెంబర్ రూ.1,73,728 కోట్లుగా ఉంది. ఎస్ఎంఈ ఇష్యూలు కూడా కలుపుకుంటే 2022–23 లో ఐపీఓల ద్వారా రూ.54,344 కోట్లను కంపెనీలు సేకరించాయి. ఇన్విట్ లేదా రైట్స్ వంటి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.9,335 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.11,231 కోట్లను కంపెనీలు సేకరించగలిగాయి. దీంతో స్టాక్స్ ఇష్యూ ద్వారా షేరుహోల్డర్లు సేకరించిన మొత్తం ఫండ్స్ విలువ 2022–23 లో రూ.76,076 కోట్లుగా రికార్డయ్యింది. బాండ్స్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్ను కూడా కలుపుకుంటే ఫైనాన్షియల్ మార్కెట్ ద్వారా కంపెనీలు రూ.85,021 కోట్లను సేకరించగలిగాయి.
ఇన్వెస్టర్ల ముందుకు 4 ఐపీఓలు..
చిన్న కంపెనీలు ఐపీఓ మార్కెట్ ద్వారా ఫండ్స్ సేకరించడానికి రెడీ అవుతున్నాయి. మొత్తం నాలుగు కంపెనీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి రూ.100 కోట్లు సేకరించనున్నాయి. ఎంఓఎస్ యుటిలిటీ, ఇన్ఫినియం ఫార్మాకెమ్ ఐపీఓలు ఎన్ఎస్ఈ ఎమెర్జింగ్ ప్లాట్ఫామ్లో లాంచ్ అవుతుండగా, ఎక్స్హికాన్ ఈవెంట్స్ మీడియా సొల్యూషన్స్, శాన్కోడ్ టెక్నాలజీస్ బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ ద్వారా ఫండ్స్ సేకరించడానికి రెడీ అవుతున్నాయి.
శాన్కోడ్, ఎంఓఎస్..
శాన్కోడ్ టెక్నాలజీస్ షేరు ఐపీఓలో రూ.47 వద్ద అందుబాటులో ఉంటుంది. శుక్రవారం ఈ కంపెనీ ఐపీఓ ఓపెన్ అవుతుంది. లాట్ సైజ్ 3,000. రూ.5.15 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఎంఓఎస్ యుటిలిటీ షేరు రూ.72–76 వద్ద అందుబాటులో ఉంటుంది. ఎస్ఎంఈ ఐపీఓ ద్వారా రూ.50 కోట్లను ఈ కంపెనీ సేకరించనుంది. లాట్ సైజ్ రూ.1,600 షేర్లు. ఈ కంపెనీ ఐపీఓ కూడా శుక్రవారమే ఓపెన్ అవుతోంది. ఎంఓఎస్ యుటిలిటీ, శాన్కోడ్ టెక్ల ఐపీఓలు ఏప్రిల్6 తో ముగుస్తాయి.
ఇన్ఫినియం ఫార్మాకెమ్, ఎక్స్హికాన్..
ఐపీఓలో ఇన్ఫినియం ఫార్మాకెమ్ షేరు ధర రూ.135 గా నిర్ణయించారు. లాట్ సైజ్ 1,000 షేర్లు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.25 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఎక్స్హికాన్ ఈవెంట్స్ మీడియా సొల్యూషన్స్ షేరు ధర ఐపీఓలో రూ.61-64 గా ఉంటుంది. లాట్ సైజ్ 2,000 షేర్లు.
ఈ రెండు కంపెనీల ఐపీఓలు శుక్రవారం ఓపెనై ఏప్రిల్ 5 తో ముగుస్తాయి.