- మేడిగడ్డ పనులకు బ్రేక్ .. బ్యారేజీకి చేరుకున్న అన్నారం నీళ్లు
- 6,7,8 బ్లాక్ల వైపు పెరుగుతున్న సీపేజీలు
- ఫౌండేషన్ టెస్టింగ్ పనులు నిలిపివేస్తున్నట్టు ఇంజనీర్ల ప్రకటన
- మోటార్లు, వెహికల్స్ ను పైకి తెచ్చిన కాంట్రాక్ట్ సంస్థ
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్పూర్, వెలుగు: లీకేజీల కారణంగా గేట్లు ఎత్తి విడుదల చేసిన అన్నారం బ్యారేజీ నీళ్లు... ఆదివారం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. అవి బ్యారేజీ కుంగిన చోట ఉన్న 6, 7వ బ్లాక్ పిల్లర్లను చుట్టుముట్టాయి. దీంతో బ్యారేజీ ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ పడింది. నీటిని తోడుతున్న మోటార్లు, రిపేర్ వర్క్స్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ అన్నింటినీ కాంట్రాక్ట్ సంస్థ ఒడ్డుపైకి తీసుకొచ్చింది. అన్నారం నుంచి వచ్చిన నీళ్లన్నీ కిందికి వెళ్లిపోయే వరకు పనులు నిలిపివేస్తున్నట్టు ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రకటించారు.
అన్నారంలో 2 టీఎంసీల నీళ్లు..
అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద కొత్తగా బుంగలు ఏర్పడ్డాయి. దీంతో రిపేర్లు చేసేందుకు శనివారం నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీలో 2 టీఎంసీల నీళ్లు ఉండగా, రోజుకు 8 వేల క్యూసెక్కుల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లు ఆదివారం ఉదయం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. ఇప్పటికే ప్రాణహితలో 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి, ఈ వాటర్ ను ఎప్పటికప్పుడు కిందికి పంపిస్తున్నారు. వీటికి అన్నారం బ్యారేజీ వాటర్ జత కావడంతో ఈ నీటిని డైవర్షన్ చేసి 3, 4వ బ్లాకుల నుంచి కిందికి పంపిస్తున్నారు.
ఆగిన పనులు..
మేడిగడ్డ బ్యారేజీ అప్ స్ట్రీమ్ లో కుంగిన 7వ బ్లాక్ వైపు డౌన్ ఉండడంతో అన్నారం నుంచి రిలీజ్ చేసిన వాటర్ నేరుగా 6, 7, 8 బ్లాకులకు చేరుకుంటున్నది. దీంతో ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు ఆటంకం కలుగుతున్నది. అలాగే చిన్న చిన్న రిపేర్ల కోసం ఇప్పటికే గోదావరిలో 7వ బ్లాక్ చుట్టూ రింగ్బండ్ వేశారు. అయితే నదిలో ఇన్ఫ్లో పెరగడంతో 7వ బ్లాక్ వైపు వాటర్ రాకుండా ఆపడం ఇంజనీర్లకు సాధ్యం కావడం లేదు. పనుల కోసం కట్టిన మట్టి కట్ట చుట్టూ వాటర్ ఎక్కువ మొత్తంలో చేరి సీపేజ్ ల వల్ల కుంగిన 20వ పిల్లర్ తో సహా మూడు బ్లాకులలోని గేట్ల వద్దకు వాటర్ చేరుకుంటున్నది. ఇన్ని రోజులు సీపేజ్వాటర్ 7వ బ్లాక్ పిల్లర్ల వద్ద నిల్వ ఉండకుండా ఎత్తి పోయడానికి పెద్ద పెద్ద మోటార్ లను ఏర్పాటు చేశారు.
ALSO READ : ఇయ్యాలా GHMC లో కౌన్సిల్ మీటింగ్
పైపులను చాపి సీపేజ్ వాటర్ ను 3, 4వ బ్లాక్ల వైపు ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు అన్నారం నుంచి వాటర్ రిలీజ్ కావడంతో మేడిగడ్డ బ్యారేజీ కి 10 వేల క్యూసెక్కుల వాటర్ వస్తుండడంతో సీపేజ్ పెరిగిపోయింది. పైగా బ్యారేజీ అప్ స్ట్రీమ్ లో గోదావరి 7వ బ్లాక్ వైపు వంపు ఉండడంతో ఆ బ్లాక్ కు చేరుకుంటున్న వాటర్ ను మట్టి కట్ట ఆపలేకపోతున్నది. ఆదివారం ఉదయం నుంచి అప్ స్ట్రీమ్ లో సీపేజ్వల్ల 6,7 బ్లాక్ లలోకి వాటర్ ఎక్కువగా వస్తున్నది. గేట్లను మూసి ఉంచినప్పటికీ, వాటర్ డౌన్ స్ట్రీమ్ కు చేరుకుంటుండటంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. బ్యారేజీ కుంగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు చేపట్టిన ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ వేశారు.వాటర్ తోడే మోటార్లను ఒడ్డుకు చేర్చి ప్రొక్లెయినర్లను, లారీలను స్టాండ్ బై లో పెట్టుకున్నారు.