- 15 నెలల్లో ముంపు సమస్యలను పరిష్కరిస్తాం
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని జంగంరెడ్డిపల్లి వద్ద లిఫ్ట్ స్కీమ్ను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. సుమారు రూ.57 కోట్లతో ఈ లిఫ్ట్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుకొండ గ్రామంలో జూరాల బ్యాక్వాటర్, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల భూ నిర్వాసితులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటుందని చెప్పారు. జూరాల బ్యాక్వాటర్ ముంపు ప్రాంతాలైన అనుగొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి, గడ్డంపల్లి గ్రామాల సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్యలను 15 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఆయా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పిస్తామని, ఇందుకోసం 80.12 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. అనుగొండ గ్రామానికి రూ.42.11 కోట్లను కేటాయించి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్అండ్ఆర్ బెనిఫిట్స్ సైతం అందజేస్తామని చెప్పారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు 20 ఏండ్ల నుంచి గోస పడుతూనే ఉన్నారన్నారు.
బాధితుల కోసం మంత్రులు, 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారన్నారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన మంత్రులు సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు, జూరాల బ్యాక్వాటర్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
