
- హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్, వెంకట్రెడ్డి
హాలియా, వెలుగు : సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాల్వ (శ్రీశైలం లోలెవల్ కెనాల్)కు సోమవారం సాగునీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పూల్యతండా వద్ద పంప్హౌస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, డీఈ వేణు చేపట్టారు. పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల్లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు జిల్లాలోని 80 చెరువులు, కుంటలను నింపుతారు. ఖరీఫ్ సీజన్ లో 120 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు డీఈ వేణు తెలిపారు.
నేడు తెరుచుకోనున్న గేట్లు
శ్రీశైలం నుంచి 1,47,195 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో సాగర్ నీటిమట్టం 585 అడుగులు చేరుకుంది. మంగళవారం ఉదయం మంత్రి ఉత్తమ్, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గేట్లను ఓపెన్ చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.