న్యూఢిల్లీ : బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుండి 12.50 శాతానికి పెంచిన తర్వాత, దీని ధర మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) రిటైల్ దేశీయ మార్కెట్లలో పెరిగి రూ.51,950 స్థాయిల వద్ద ముగిసింది. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2.81 డాలర్లు పెరిగి 1810.10 డాలర్ల వద్ద ముగిసింది. అందుకే ఈ వారంలో దేశీయ మార్కెట్లో పుత్తడి రేట్లు పెరిగాయి. నిజానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్లో బంగారం ధర 6.74 శాతం తగ్గింది. బులియన్ ఎక్స్పర్టులు అభిప్రాయం ప్రకారం, బంగారం ధర ఎంసీఎక్స్లో రూ.50,600 వద్ద, స్పాట్ మార్కెట్లో 1770 డాలర్ల వద్ద కీలక మద్దతు కంటే బాగానే ఉంది. ఆయా మార్కెట్లలో ఈ మద్దతు స్థాయిలు చెక్కుచెదరకుండా ఉండే వరకు ప్రతి డిప్లో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయాలని సూచించారు.
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ ‘‘స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1770 డాలర్ల వద్ద దాని ప్రధాన మద్దతు కంటే ఎక్కువగా నిలుపుకోగలిగింది. శనివారం స్పాట్ బంగారం ధర 1770 డాలర్ల నుండి 1835 డాలర్ల రేంజ్లో ఉంది. ఈ చిన్న అడ్డంకిని 1835 డాలర్ల స్థాయిల వద్ద దాటేస్తే, స్పాట్ గోల్డ్ తదుపరి లక్ష్యం 1865 డాలర్లు,1900 డాలర్ల వరకు ఉంటుంది. స్పాట్ బంగారానికి 1770 డాలర్ల వద్ద బలమైన సపోర్ట్ దొరుకుతోంది. దీంతో స్పాట్ ధర 1790 డాలర్ల – 1800 డాలర్ల మధ్య కదిలే చాన్స్ ఉంటుందని ఎనలిస్టులు అంటున్నారు. బంగారం కొనేందుకు ఇది మంచి సమయం. షార్ట్ పొజిషన్ను తీసుకోకుండా, స్వల్పకాలానికి 'బై ఆన్ డిప్స్' వ్యూహాన్ని కొనసాగించాలి’’ అన్నారు.