గాజాపై ఇజ్రాయెల్ దాడి 33 మంది మృతి.. 100 టార్గెట్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

గాజాపై ఇజ్రాయెల్ దాడి 33 మంది మృతి.. 100 టార్గెట్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

డెయిర్ అల్‌‌ బలా(గాజా స్ట్రిప్): గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 33 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాజాలోని 100 టార్గెట్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గాజా సిటీలోని 2 ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన తాజా దాడుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ట్రీట్​మెంట్ ఇస్తున్నామని షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మహ్మద్ అబు సెల్​మియా తెలిపారు. అదేవిధంగా, దక్షిణ గాజాలోని మువాసిపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానికదాడులు చేసింది. 

ఈ ఘటనలో 13 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాయపడిన వారిని దగ్గర్లోని నసీర్ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఆదివారం నాటికి గడిచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్​లోని 130 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, స్టోరేజ్ కేంద్రాలు, వెపన్స్, లాంచర్లను ధ్వంసం చేశామని తెలిపింది. 

ట్రంప్​తో చర్చలకు సిద్ధమైన బెంజమిన్

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్లనున్నారు. వైట్ హౌస్​లో ట్రంప్​తో సీజ్​ఫైర్ పై చర్చించనున్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించుకోవడంతో పాటు 60 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను ట్రంప్ సిద్ధం చేశారు. ఈ రెండు అంశాలపై ట్రంప్, నెతన్యాహు చర్చించుకోనున్నారు. కాగా.. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్​పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో వార్ మొదలైంది. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 57వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.