
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో ప్రగతిని సాధించింది. రిమోట్ సెన్సింగ్ రాకెట్లతో ఇస్రో ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి విదేశాలు సైతం మన దేశం వైపు చూసేలా ఎదిగింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఘనకీర్తిని సాధించింది. విజయవంతంగా చంద్రుడిపైకి సైతం చంద్రయాన్ ప్రయోగాలను చేసిన ఇస్రో మూడో ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరోవైపు మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్యాన్, సూర్యుడిపైకి ఆదిత్య ఎల్–1, శుక్రగ్రహంపైకి శుక్రయాన్–1 ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తోంది.
చంద్రుడిపై భవిష్యత్తులో పూర్తిస్థాయి మానవ స్థావరం ఏర్పాటు చేసి, రోదసి పరిశోధనకు ఉద్దేశించిన కార్యక్రమం చంద్రయాన్–1. ఈ కార్యక్రమానికి 2003లో భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలార్ శాటిలైట్ ల్యాంచ్ వెహికిల్ – సి11(పీఎస్ఎల్వీ–సి11) ద్వారా విజయవంతంగా 2008, అక్టోబర్ 22న ప్రయోగించింది. అధిక పరిమాణం ఉన్న స్ట్రాప్ ఆన్ బూస్టర్ మోటార్లను తొలిసారిగా పీఎస్ఎల్వీ–సి11లో వినియోగించారు. చంద్రుని ఉపరిత 3డి చిత్రీకరణ, ఖనిజ నిర్మాణం, నీటి నిక్షేపాల అన్వేషణ, చంద్రుని ఆవిర్భావ విషయాలు చంద్రుని గుర్వాతకర్షణ లక్ష్యాలతో ఇస్రో చంద్రయాన్–1ను నిర్వహించింది. చంద్రయాన్–1 ఉపగ్రహంలో భాగంగా 11 పరికరాలను ఇస్రో ప్రయోగించింది. వాటిలో భారత్–5, అమెరికా–2, యూరోపియన్ ఏజెన్సీ –3, బల్గేరియా–1కు చెందినవి ఉన్నాయి. 5.5 రోజుల ప్రయాణం తర్వాత 2008, అక్టోబర్ 28న చంద్రయాన్ –1 చంద్రుడి 100కి.మీ. ధ్రువ కక్ష్యలోకి చేరింది. 2008, నవంబర్ 14న భారత్కు చెందిన మూవ్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే పరికరం చంద్రయాన్–1 నుంచి విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పతనమై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈ ప్రాంతాన్ని జవహర్ స్థల్ అంటారు. చంద్రయాన్–1 నుంచి సమాచారం సేకరించేందుకు బెంగళూరు సమీపాన బ్యాలాలు గ్రామం వద్ద 18 మీటర్ల వ్యాసం ఉన్న ఒక భారీ ఏంటెన్నాను డీప్స్పేస్ నెట్వర్క్లో భాగంగా ఇస్రో ఏర్పాటు చేసింది. రెండేండ్ల జీవితకాలం ఉన్న చంద్రయాన్–1తో 2009, ఆగస్టు 29న ఇస్రో సంబంధాలను కోల్పోయింది.
చంద్రయాన్–3
చంద్రయాన్–2కు కొనసాగింపుగా త్వరలో ఇస్రో చంద్రయాన్–3 కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో కేవలం ల్యాండర్ ను మాత్రమే ఇస్రో ప్రయోగిస్తుంది. దీనిని తొలుత చంద్రుని కక్ష్యలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపైకి సాఫ్ట్ ల్యాండింగ్ను నిర్వహిస్తారు. చంద్రయాన్–3ను ల్యాండర్ నుంచి సమాచారం చంద్రయాన్–2 ఆర్బిటర్ సేకరించి భూమి పైకి పంపిస్తుంది.
మంగళ్యాన్
ఇస్రో నిర్వహించిన మొదటి గ్రహాంతర కార్యక్రమం. 2013, నవంబర్ 5న పీఎస్ఎల్వీ–25 ద్వారా ఇస్రో మంగళ్యాన్ ప్రయోగించింది. తొలుత భూ అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశించి ఆ తర్వాత కక్ష్యా మార్పిడి ద్వారా 2013, డిసెంబర్ 1న అంగారక ట్రాజెక్టరీలోకి మంగళ్యాన్ ప్రవేశించింది. సుమారు 9 నెలలపాటు ప్రయాణించిన మంగళ్యాన్ 2014, సెప్టెంబర్ 14న విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష కార్యక్రమం తర్వాత అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన నాలుగో అంతరిక్ష సంస్థ ఇస్రో. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం భారత్. మంగళ్యాన్ బరువు 1337 కిలోలు. ఇందులో 5 సాంకేతిక పరికరాలున్నాయి.
లైమన్ ఆల్ఫాఫొటో మీటర్ 2. మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్ 3. మాస్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కంపోజిషన్ ఎనలైజర్ 4. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ 5. మార్స్ కలర్ కెమెరా.
ఆదిత్య ఎల్ –1
సూర్యుడి కరొనా అధ్యయనానికి ఉద్దేశించిన ప్రత్యేక ఉపగ్రహం. 2019–20 మధ్యకాలంలో పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో సూర్యుడి కరొనా అధ్యయనానికి విజిబుల్ ఎమిషన్ లైన్ కరొనాగ్రఫ్(వీఈఎల్సీ) అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. సూర్యుని భూమి వ్యవస్థలోని ల్యాగ్రాంజియన్ పాయింట్ వన్ (ఎల్1) అనే కక్ష్యలోకి ఆదిత్యను ఇస్రో ప్రయోగించనుంది.
శుక్రయాన్
త్వరలో భారత్ నిర్వహించనున్న రెండో గ్రహాంతర కార్యక్రమం శుక్రయాన్. మొదట 2024 డిసెంబర్ నాటికి వీనస్/ శుక్రగ్రహంపైకి ఇస్రో శుక్రయాన్ను ప్రయోగించాలనుకుంది. కరోనా కారణంగా ఈ ప్రయోగాన్ని 2031కు వాయిదా వేసింది. ప్రతి 19 నెలలకు ఒక్కసారి శుక్రగ్రహం భూమికి సమీపంగా వస్తుంది. ఈ లెక్కన 2024లో తప్పితే 2026, 2028లో కూడా శుక్రయాన్కు అనుకూలం. కానీ ప్రతి ఎనిమిందేండ్లకు ఒక్కసారి శుక్రుడు భూమికి మరింత చేరువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని 2031లో శుక్రయాన్ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇందులో సింథటిక్ అపెర్చర్ రాడార్ పరికారాన్ని ఇస్రో ప్రయోగించనుంది.
చంద్రయాన్–2
చంద్రుడిపైకి ఇస్రో నిర్వహించిన రెండో కార్యక్రమం చంద్రయాన్–2. దీనిని జీఎస్ఎల్వీ – మార్క్3 ఎం1 నౌక ద్వారా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2022, జులై 19న ఇస్రో ప్రయోగించింది. చంద్రయాన్–2 ఉపగ్రహం బరువు 3850 కిలోలు. ఇందులో 3 భాగాలున్నాయి.
- ఆర్బిటర్ – ఇది చంద్రుని చుట్టూ తిరుగుతుంది.
- ల్యాండర్ – ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది. దీనికి విక్రమ్ అని పేరు పెట్టారు.
- రోవర్ – దీనిని ప్రజ్ఞా అంటారు. ఇది రోవర్ నుంచి బయటకు వచ్చి చంద్రునిపై చక్రాలతో తిరుగుతుంది.
2019, సెప్టెంబర్ 7న నిర్వహించిన సాఫ్ట్ ల్యాండింగ్లో ఇస్రో విఫలం చెందింది. చంద్రయాన్–2 కూలిన ప్రాంతాన్ని గుర్తించడంలో నాసాకు చెందిన లూనార్ రికన్నైసెన్స్ ఆర్బిటర్(ఎన్ఆర్ఓ) భారత్కు సాయపడింది. చంద్రయాన్–2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ను చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించాలని అనుకుంది. ఇదీ సాధ్యం కాలేదు. మొదట చంద్రయాన్–2 ఆర్బిటర్ జీవితకాలం ఏడాదిగా నిర్దేశించినా తర్వాత దాని జీవిత కాలాన్ని ఏడేండ్లకు పొడిగించారు.
గగన్యాన్
ఇస్రో నిర్వహించబోతున్న తొలి మానవ సహిత అంతరిక్షయాన్ కార్యక్రమం గగన్యాన్. ఇందులో భాగంగా ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్ – 3 నౌకను సిద్ధం చేస్తోంది. వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందిస్తుంది. వ్యోమగాములకు స్పేస్గ్రేడ్ ఆహారం, ఔషధాలను డీఆర్డీవో సిద్ధం చేస్తుంది. మొదటి, రెండు దశలో వ్యోమగాములు లేకుండా ఆ తర్వాత మూడోసారి వ్యోమగాములతో ప్రయోగిస్తుంది. ఇందు కోసం బెంగళూరులో హ్యుమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏర్పడింది. గగన్యాన్లో వ్యోమగాముల పరిస్థితులను పర్యవేక్షించడానికి వోమ్యమిత్ర అనే రోబోను అభివృద్ధి చేసింది.
ఆస్ట్రోశాట్
దేశ తొలి ఖగోళశాస్త్ర ఉపగ్రహం ఆస్ట్రోశాట్. పీఎస్ఎల్వీ–సి30 ద్వారా 2015, సెప్టెంబర్ 28న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించింది. ఆస్ట్రోశాట్ బరువు 1513 కిలోలు. ఇందులో ఐదు పేలోడ్లు ఉన్నాయి. అమెరికా, యూరప్, రష్యా, జపాన్ల తర్వాత ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించింది. ఆస్ట్రాశాట్ను బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ వద్ద అభివృద్ధి చేశారు. ఇది గ్రహవ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణబిలాలు, భూమిలాంటి గ్రహాలను అన్వేషిస్తుంది. ముంబయిలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ వఫర్ ఆస్ట్రోనమి, ఆస్ట్రో ఫిజిక్స్ ఈ ఉపగ్రహం అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి.